Telangana BJP: కౌన్ బనేగా తెలంగాణ బీజేపీ ప్రెసిడెంట్.. ఇద్దరి మధ్యే ప్రధాన పోటీ..!

తెలంగాణ రాజకీయాల నుంచి అందుతున్న బిగ్ బ్లాస్టింగ్ న్యూస్ ఇది. కౌన్ బనేగా తెలంగాణ బీజేపీ ప్రెసిడెంట్.. ఇప్పుడు ఇదే ట్రెండింగ్ టాపిక్. ఈ ప్రశ్నకు దాదాపుగా సమాధానం దొరికేసింది. ఇవాళ నోటిఫికేషన్‌. రేపు నామినేషన్‌. జులై 1న కొత్త అధ్యక్షుడి పేరు విడుదల కాబోతోంది.

Telangana BJP: కౌన్ బనేగా తెలంగాణ బీజేపీ ప్రెసిడెంట్.. ఇద్దరి మధ్యే ప్రధాన పోటీ..!
Etela Rajender Arvind Dharmapuri

Updated on: Jun 29, 2025 | 7:54 AM

తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడి ఎన్నికపై దాదాపుగా క్లారిటీ వచ్చేసింది. ఇద్దరు నేతల మధ్యే ప్రధానంగా పోటీ నెలకొంది. మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్‌, నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అరవింద్.. అధ్యక్ష పదవికి నామినేషన్‌ వేసే అవకాశం ఉందంటున్నాయి బీజేపీ వర్గాలు. వీళ్లిద్దరిలోనే ఒకరికి అధ్యక్ష పదవి దక్కవచ్చంటున్నాయి కాషాయ పార్టీ వర్గాలు. ఇక జులై 1న కొత్త అధ్యక్షుడి పేరు ప్రకటిస్తారు. జూలై 1న కొత్త అధ్యక్షుడి పేరు ప్రకటన ఉండబోతోందని బీజేపీ నేషనల్ ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్, ఎంపీ లక్ష్మణ్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో కొత్త అధ్యక్షుడిగా ఎవరికి పదవి దక్కబోతోందనే ఆసక్తి బీజేపీ వర్గాల్లో మొదలైంది.

అధ్యక్ష పదవి కోసం పార్టీలోని ముఖ్య నేతలంతా ఎవరి స్థాయిలో వాళ్లు ప్రయత్నాలు చేశారు. కానీ సుదీర్ఘ కసరత్తు, అనేక సమీకరణాలు, వడపోతల తర్వాత.. చివరగా రేసులో ఇద్దరే ఇద్దరు నేతలు మిగిలారు. వాళ్లే ధర్మపురి అర్వింద్, ఈటల రాజేందర్. వీళ్లిద్దరిలో ఎవరో ఒకరికి తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి ఖాయమని పార్టీలో చర్చ జరుగుతోంది. బయటికి చెప్పకపోయినప్పటికీ.. పార్టీలో ఇప్పటికే నిర్ణయం జరిగిపోయిందనీ.. ధర్మపురి అర్వింద్.. లేదా ఈటల రాజేందర్‌లో ఒకరికి పార్టీ పగ్గాలు దక్కబోతున్నాయనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే సామర్థ్యం ఉన్న నేతకే పార్టీ పగ్గాలు అప్పగిస్తామని ఎంపీ లక్ష్మణ్‌ ప్రకటించారు.

పార్టీకి విధేయుడు ధర్మపురి అర్వింద్‌

పార్టీకి విధేయుడిగా ధర్మపురి అర్వింద్‌కు గుర్తింపు ఉంది. ఇక బీజేపీ అగ్రనేతలు మోదీ, అమిత్‌షాకు సన్నిహితుడిగాను ఆయన ముద్ర వేసుకున్నారు. తెలంగాణలో బలమైన మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన నేత. సూటిగా విమర్శలు చేయడంలో దిట్టగా పేరు తెచ్చుకున్నారు. మిగతా నేతల నుంచి పెద్దగా వ్యతిరేకత లేకపోవడం, బలమైన రాజకీయ నేపథ్యం ఆయనకు కలిసివచ్చే అంశాలుగా భావిస్తున్నారు. అయితే కుటుంబ నేపథ్యం కాంగ్రెస్‌ కావడం ఆయనకు కొంత మైనస్‌గా భావిస్తున్నారు. జిల్లాకే పరిమితం అవుతారని, రాష్ట్రవ్యాప్తంగా వ్యక్తిగత కేడర్‌ లేపోవడం, దూకుడుగా వ్యవహరించే మనస్తత్వం.. ఆయనకు నెగటివ్‌ అంశాలు అంటున్నాయి బీజేపీ వర్గాలు.

బలమైన బీసీ నేతగా ఈటలకు గుర్తింపు

ఇక ఈటల రాజేందర్‌ను తీసుకుంటే.. తెలంగాణలో బలమైన బీసీ నేతగా ఆయనకు గుర్తింపు ఉంది. ఉద్యమ నాయకుడిగా ప్రజాదరణ ఉంది. రాష్ట్ర రాజకీయాలపై పూర్తి పట్టు ఉండడంతో పాటు ప్రత్యర్థి పార్టీల బలాబలాలపై అవగాహన ఉంది. పార్టీలో చేరినప్పుడు అధిష్టానం ఇచ్చిన హామీ కూడా ఆయనకు అనుకూలమైన అంశమే అంటున్నాయి కమలం వర్గాలు. సుదీర్ఘ రాజకీయ అనుభవంతో పాటు, తెలంగాణలో అత్యధిక జనాభా ఉన్న ముదిరాజ్‌ సామాజికవర్గ నేత కావడం ఆయనకు పాజిటివ్‌గా మారనుంది. అయితే వామపక్ష భావజాలం ఉన్న ఈటలను RSS నేతలు ఎంతవరకు అంగీకరిస్తారో చూడాలి. మొదటినుంచి బీజేపీలో లేకపోవడం కూడా ఆయనకు నెగటివ్‌ అంటున్నాయి కాషాయ వర్గాలు.

ఇక ఎమ్మెల్యే రాజాసింగ్‌ కూడా అధ్యక్ష పదవిని ఆశిస్తున్నారు. నామినేషన్‌ వేయాలా వద్దా అనేదానిపై తర్వాత నిర్ణయించుకుంటానన్నారు ఆయన. ఇక ఈటల, ధర్మపురిలో ఎవరు టీ బీజేపీ చీఫ్‌ అవుతారో చూడాలి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..