Telangana: తెలంగాణ బీజేపీ ఎన్నికల కమిటీ సారథిగా ఈటల..?
ఎన్నికలు జరిగే ఐదు రాష్ట్రాలపై బీజేపీ ఫొకస్ పెట్టింది. అంతర్గత కలహాలు, విభేదాలు చక్కదిద్దేలా ప్లాన్ ఆఫ్ యాక్షన్ రూపొందించింది. పార్టీ నుంచి ఎవరూ బయటకు వెళ్లకుండా చూసేలా వ్యూహం రచించింది.

త్వరలో ఎన్నికలు జరిగే ఐదు రాష్ట్రాలపై బీజేపీ జాతీయ నాయకత్వం దృష్టి సారించింది. దీనికి సంబంధించి ప్లాన్ ఆఫ్ యాక్షన్ రూపొందించినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లోని సీనియర్ నాయకులకు కీలక బాధ్యతలు అప్పగించడం ద్వారా పార్టీలో అంతర్గత తగదాలు నాయకుల మధ్య విభేదాలు చక్కదిద్దేలా బీజేపీ అధిష్ఠానం వ్యూహాన్ని రూపొందించినట్టు తెలుస్తోంది. తెలంగాణకు సంబంధించి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకున్న హైకమాండ్ – రాష్ట్ర అధ్యక్ష మార్పు ఉన్నా లేకున్నా పార్టీపరంగా కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. రానున్న ఎన్నికల కోసం ప్రత్యేకంగా ఎలక్షన్ కమిటీ ఏర్పాటు చేయాలని బీజేపీ జాతీయ నాయకత్వం నిర్ణయం తీసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. టికెట్ల కేటాయింపు, ఎన్నికలకు సంబంధించిన వ్యవహారాలకు కీలకంగా వ్యవహరించే ఈ కమిటీ బాధ్యతలు సీనియర్ నేత ఈటల రాజేందర్కు అప్పగించనున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంలో ఈటలకు ఢిల్లీ పెద్దల నుంచి సంకేతాలు వచ్చినట్టు సమాచారం. ఈ మధ్యే ఢిల్లీ వెళ్లి పార్టీ పెద్దలతో ఈటల సమావేశమైన సంగతి తెలిసిందే. అక్కడి నుంచి వచ్చిన ఆ సంకేతాలను బట్టే ఈటల నిన్న ట్వీట్ చేసినట్టు తెలుస్తోంది.
ప్రజల ఆశీర్వాదం దొరికే సందర్భం ఆసన్నమైంది, ప్రజల ఆశీర్వాదంతో ఒక సైనికుడిలా పనిచేస్తానని ట్వీట్లో ఈటల పేర్కొన్నారు. ఈటల నిన్న రాత్రి చేసిన ట్వీట్ చూసి ఆయన అభిమానులు పండగ చేసుకుంటున్నారు. దాదాపు 60 పదాలతో కూడిన ఈటల ట్వీట్ అనేక విషయాలను చెప్పకనే చెప్తోంది. తెలుగులోనే కాదు ఇదే విషయాన్ని హిందీలోనూ ఈటల ట్వీట్ చేశారు. ప్రధాని మోదీ, అమిత్ షా, జాతీయ బీజేపీ, తెలంగాణ బీజేపీ ట్విట్టర్స్కు ఈ ట్వీట్ను ఆయన ట్యాగ్ చేశారు. ఇప్పటి వరకు దాదాపు 56 వేల మంది ఈ ట్వీట్ను చూశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..