
మంచిర్యాల జిల్లా చెన్నూరులో దేవాదాయ శాఖ భూముల కబ్జా వ్యవహారం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవడానికి వెళ్లిన అధికారులపై కబ్జాదారులు కారంపొడి, పెట్రోల్తో దాడికి తెగబడ్డారు. ప్రాణభయంతో అధికారులు పరుగులు తీసిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. చెన్నూరు మున్సిపాలిటి జాతీయ రహదారి సమీపంలో దేవాదాయ శాఖకు సంబంధించిన భూమిని కొంతమంది కబ్జా చేశారు. ఈ భూములను తిరిగి ప్రభుత్వ స్వాధీనంలోకి తీసుకోవాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రావడంతో దేవాదాయ శాఖ అధికారులు శనివారం క్షేత్రస్థాయికి చేరుకున్నారు. ఆక్రమణలను తొలగించి, భూమిని స్వాధీనం చేసుకునే ప్రక్రియను ప్రారంభించారు. ఈ క్రమంలో కబ్జాదారులు అధికారులపై కారంపొడి, పెట్రోల్తో దాడికి తెగబడ్డారు.
కబ్జాదారులు ఒక్కసారిగా ఊహించని విధంగా పెట్రోల్, కారంపొడితో దాడికి తెగబడటంతో అధికారులు షాక్ అయ్యారు. వెంటనే తేరుకుని ప్రాణభయంతో అక్కడినుంచి పరుగులు తీశారు. ఈ దాడిలో కొందరు అధికారులకు స్వల్ప గాయాలైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ఆందోళనకారులను అడ్డుకున్నారు. ప్రభుత్వ అధికారులపై దాడికి పాల్పడి, విధులకు ఆటంకం కలిగించిన కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. ఈ ఉద్రిక్తత నేపథ్యంలో చెన్నూరులో అదనపు బలగాలను మోహరించారు.