TSRTC: తెలుగు రాష్ట్రాల మధ్య పరుగులు పెట్టనున్న ఎలక్ట్రిక్‌ ఏసీ బస్సులు.. ప్రత్యేకతలు ఓ రేంజ్‌లో ఉన్నాయి.

ప్రజలకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించే దిశగా తెలగాణ ఆర్టీసీ అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే ఎన్నో రకాల చర్యలు చేపడుతూ వస్తోన్న ఆర్టీసీ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికులకు ఎలక్ట్రిక్‌ ఏసీ బస్సులు అందుబాటులోకి...

TSRTC: తెలుగు రాష్ట్రాల మధ్య పరుగులు పెట్టనున్న ఎలక్ట్రిక్‌ ఏసీ బస్సులు.. ప్రత్యేకతలు ఓ రేంజ్‌లో ఉన్నాయి.
Ac Electric Bus

Updated on: Apr 17, 2023 | 6:53 PM

ప్రజలకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించే దిశగా తెలగాణ ఆర్టీసీ అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే ఎన్నో రకాల చర్యలు చేపడుతూ వస్తోన్న ఆర్టీసీ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికులకు ఎలక్ట్రిక్‌ ఏసీ బస్సులు అందుబాటులోకి తీసుకువస్తున్నారు. వచ్చే నెలలో కొన్ని బస్సులను ప్రారంభించేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్‌ఆర్టీసీ) ఏర్పాట్లు చేస్తోంది. పర్యావరణ హితం, కాలుష్య నివారణతో పాటు ప్రజలకు మెరుగైన, సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతిని కలిగించేందుకు ఈ బస్సులను వాడకంలోకి తీసుకురాబోతుంది. విజయవాడ మార్గంలో తొలిసారిగా 50 ఎలక్ట్రిక్‌ ఏసీ బస్సులను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు సంస్థ ప్రకటించింది.

ఈ క్రమంలోనే సోమవారం హైదరాబాద్‌ లోని బస్ భవన్ ప్రాంగణంలో ప్రోటో (నమూనా) ఎలక్ట్రిక్‌ ఏసీ బస్సును టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్‌ పరిశీలించారు. బస్సులో ప్రయాణికులకు కల్పిస్తోన్న సౌకర్యాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలను అందించేందుకు ఈ బస్సులను అందుబాటులోకి తీసుకువస్తున్నామని, సౌకర్యాల విషయంలో రాజీ పడొద్దని ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌ లిమిటెడ్ ప్రతినిధులకు సూచించారు. వచ్చే నెలలోనే కొన్ని బస్సులను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. పర్యావరణహిత ఎలక్ట్రిక్‌ బస్సులకు ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

బస్సు ప్రత్యేకతలివే..

12 మీటర్ల పొడవు గల ఎలక్ట్రిక్‌ ఏసీ బస్సుల్లో 41 సీట్ల సామర్థ్యం ఉంది. ఈ బస్సులకు ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 325 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణించవచ్చు. బస్సులో ప్రతి సీటు వద్ద మొబైల్ చార్జింగ్ సౌకర్యంతో పాటు రీడిండ్‌ ల్యాంప్‌లు ఉన్నాయి. ప్రయాణికుల భద్రత దృష్ట్యా వెహికిల్‌ ట్రాకింగ్‌ సిస్టంతో పాటు ప్రతి సీటు వద్ద పానిక్‌ బటన్‌ సదుపాయం కల్పించారు. వాటిని టీఎస్‌ఆర్టీసీ కంట్రోల్‌ రూమ్‌కి అనుసంధానం చేస్తారు. ప్రతి బస్సులోనూ మూడు సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వాటికి ఒక నెల రికార్డింగ్‌ బ్యాకప్‌ ఉంటుంది. బస్సు రివర్స్‌ చేసేందుకు వీలుగా రివర్స్‌ పార్కింగ్‌ అసిస్టెన్స్‌ కెమెరా ఉంటుంది. బస్సుకు ముందు వెనక ఎల్ఈడీ బోర్డులుంటాయి. అందులో గమ్యస్థానాల వివరాలు కనిసిప్తాయి. అగ్నిప్రమాదాలను ముందుగానే గుర్తించి నివారించేందుకు బస్సుల్లో ఫైర్‌ డిటెక్షన్‌ సప్రెషన్‌ సిస్టం(ఎఫ్‌డీఎస్‌ఎస్‌)ను ఏర్పాటు చేశారు. ప్రయాణికులకు సమాచారం చేరవేసేందుకు వీలుగా పబ్లిక్‌ అడ్రస్‌ సిస్టం బస్సుల్లో ఉంటుంది.

ఇదిలా ఉంటే.. పర్యావరణ పరిరక్షణ కోసం ఎలక్ట్రిక్‌ బస్సులను అందుబాటులోకి తీసుకురావాలని టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. అందులో భాగంగా ఒలెక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్(ఓజీఎల్)కు 550 ఎలక్ట్రిక్ బస్సుల ఆర్డర్ ఇచ్చింది. అందులో 500 బస్సులను హైదరాబాద్‌ సిటీలో, 50 బస్సులు విజయవాడ మార్గంలో తిప్పనుంది. ఇవి కాకుండా అశోక్ లేలాండ్, జీబీఎం సంస్థల నుంచి కూడా మరో 1000 ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి రానున్నాయి. గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్ (GCC) పద్ధతిలో విడతల వారీగా ఈ బస్సులను ఆయా సంస్థలు టీఎస్‌ఆర్టీసీకి అందజేయనున్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..