మామిడి పంటపై కరోనా మహమ్మారి ఎఫెక్ట్‌… పెట్టుబడి కూడా దక్కడం లేదని రైతుల ఆవేదన..

| Edited By: Ravi Kiran

May 04, 2021 | 2:40 PM

కరోనా ఎఫెక్ట్ మామిడి రైతులపై మోయలేని ఆర్థిక భారాన్ని మోపింది. ఈ ఏడాది మామిడి కాపు అంతంతమాత్రంగానే ఉన్నాయి.

మామిడి పంటపై కరోనా మహమ్మారి ఎఫెక్ట్‌... పెట్టుబడి కూడా దక్కడం లేదని రైతుల ఆవేదన..
Mango Tree (1)
Follow us on

కరోనా ఎఫెక్ట్ మామిడి రైతులపై మోయలేని ఆర్థిక భారాన్ని మోపింది. ఈ ఏడాది మామిడి కాపు అంతంతమాత్రంగానే ఉన్నాయి. దానికి తోడు కరొనా ఎఫెక్ట్‌తో ధరలేక వ్యాపారులు అడిగినకాడికి మార్కెట్లో అప్పజెప్పి వస్తున్నారు మామిడి రైతులు. లాభం కాదుగదా పెట్టిన పెట్టుబడి కూడా దక్కడం లేదని మామిడి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో పెద్దమొత్తంలో మామిడి సాగు చేస్తున్నారు. ఇక్కడి మామిడిని ఇతర రాష్ట్రాలతో పాటు విదేశాలకు కూడా ఎగుమతి చేసేవారు. గత ఏడాది కాలం నుండి కరొనా మహమ్మారి వల్ల మామిడి ఎగుమతి చేయలేక పోతున్నారు. ప్రస్తుతం పొరుగు రాష్ట్రాల్లో లాక్డౌన్ పెట్టడంవల్ల మామిడిని ఎగుమతి చేయలేకపోతున్నారు వ్యాపారులు. దీంతో మామిడి రేటు పూర్తిగా పడిపోయింది. నలభై నుండి యాభై రూపాయలకు ఉండాల్సిన కేజీ ధర, ప్రస్తుతం పదిహేను, ఇరవై రూపాయలు ధర పలుకుతోంది. వ్యాపారులు సిండికేట్గా ఏర్పడి నిలువునా దోచుకుంటున్నారని మామిడి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కరొనా మహమ్మారితో పాటు ఈ ఏడాది వాతావరణ మార్పుల కారణంగా మామిడికాయలకు తేనెమంచు వైరస్, మంగు, మామిడి కాయపై మచ్చలు ఏర్పడటంతో మామిడి కాయలు కొనేందుకు వ్యాపారులు కూడా ఆసక్తి చూపడం లేదు. వ్యాపారులు అడిగినకాడికి ఇచ్చేసి నష్టాలను చవిచూస్తున్నారు.

పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలో సుద్దాల, రేగడిమద్దికుంట, అల్లిపూర్, కనుకుల గ్రామాల్లో ఈదురుగాలులకు మామిడి కాయలు పెద్ద మొత్తంలో నేల రాలిపోయాయి. దీంతో రైతులకు భారీ నష్టం వాటిల్లింది. ఇప్పటికైనా కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు వరి , మొక్కజొన్న పంటలకు ఎలాగైతే మద్దతు ధర ప్రకటించారో అదేవిధంగా మామిడి రైతులకు కూడా మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ప్రభుత్వమే మామిడి మార్కెట్ను ఏర్పాటు చేసి, రైతులను ఆర్థికంగా చితికిపోకుండా ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని రైతులంటున్నారు. మామిడి రైతులతో పాటు మామిడి కౌలు రైతులు కూడా అప్పులు , వడ్డీలు చెల్లించలేక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉందంటున్నారు.