
హైదరాబాద్లోని మదాపూర్లో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ కీలక భేటీలో రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై ముఖ్యమంత్రి కేంద్ర మంత్రికి వివరించారు.
మిగిలిన 9.56 లక్షల ఇండ్లు కేటాయించాలి..
కేంద్ర ప్రభుత్వం PMAY-G పథకంలో భాగంగా మొదటి విడతగా రాష్ట్రానికి 2 లక్షల ఇండ్లను కేటాయించిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. గత జూలైలో ఢిల్లీలో కేంద్రమంత్రిని కలిసినప్పుడు, 11,56,915 మంది అర్హులైన గ్రామీణ కుటుంబాలకు ఇండ్లు మంజూరు చేయాలని వినతి పత్రం అందించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. రాష్ట్ర డిమాండ్కు అనుగుణంగా ఇంకా మిగిలి ఉన్న 9.56 లక్షల ఇండ్లను కూడా వెంటనే కేటాయించాలని ఆయన కోరారు.
ఎల్నినో పరిస్థితులపై కేంద్రం సహకరించాలి..
రాష్ట్రంలో నెలకొన్న ఎల్నినో ప్రభావంపై కేంద్ర మంత్రికి సీఎం వివరించారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో వ్యవసాయంలో విద్యుత్ వినియోగం పెరిగిందని ఆయన పేర్కొన్నారు. అయితే ఎల్నినో కారణంగా తాగునీరు, విద్యుత్ కొరత తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసిందని స్పష్టం చేశారు. వ్యవసాయ రంగంలో ఈ ఎల్నినో పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు కేంద్రం నుంచి అవసరమైన సహకారం అందించాలని సీఎం విజ్ఞప్తి చేశారు.
ప్రత్యామ్నాయ పంటలు, సన్నబియ్యం పంపిణీ..
దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో పేదలకు రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యాన్ని అందిస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. అలాగే, సన్న వడ్లు పండించే రైతులను ప్రోత్సహించేందుకు రూ.500 బోనస్ అందిస్తున్నామన్నారు. ఎల్నినో నేపథ్యంలో రాష్ట్రంలో ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులను ప్రోత్సహిస్తున్నామని, పంట మార్పిడిపై రైతులను మరింత ప్రోత్సహించాల్సిన అవసరాన్ని గుర్తించి కేంద్రం సహకరించాలని కోరారు.
250 ఎకరాల్లో మార్కెట్..
వ్యవసాయ రంగానికి ఊతమిచ్చేలా, 250 ఎకరాల విస్తీర్ణంలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఫ్రూట్స్, వెజిటెబుల్ మార్కెట్ను ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.