
యూకే పర్యటనకు అనుమతి ఇచ్చి.. అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతి ఇవ్వకపోవడంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. తన విదేశీ పర్యటనను.. కావాలనే కేంద్రం అడ్డుకుందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. వికసిత్ భారత్ పేరుతో కేంద్రం పనిచేస్తోందని.. తెలంగాణ రైజింగ్ విజన్తో తాము ముందుకెళ్తున్నామని సీఎం తెలిపారు. రాష్ట్రాల కలయికతోనే దేశాభివృద్ధి జరుగుతుందన్నారు. విదేశీ పర్యటనల ద్వారా తెలంగాణ అభివృద్ధి చేయాలని చూస్తున్నామని.. దీనికోసం ఒక ప్రత్యేక కార్యచరణతో ముందుకు వెళ్తున్నామన్నారు. అయితే.. ఇంగ్లాండ్ పర్యటనకు అనుమతి ఇచ్చి.. అమెరికా పర్యటనకు నిరాకరించడంలో కేంద్రం అంతర్యమేంటని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. బీజేపీ నేతలు విచక్షణ కోల్పోయారు.. అవాస్తవాలను ప్రచారం చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. విదేశాల్లో ఉండంగా స్పందిస్తే.. దేశద్రోహి అనే వారని.. అందుకే ఇక్కడకు వచ్చి మాట్లాడుతున్నానని.. కేంద్రం వైఖరి ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధమని సీఎం ఆగ్రహం వ్యక్తంచేశారు. తన పర్యటనను మాత్రమే అడ్డుకున్నారని.. కానీ.. తన లక్ష్యాన్ని ఆపలేకపోయారని పేర్కొన్నారు. యూఎస్ కు అధికారులను పంపామని, ఆక్స్ఫర్డ్ తో ఒప్పందం జరుగుతుందని తెలిపారు.
తన పర్యటనలో దాపరికం ఏమీ లేదని, దాపరికం ఉన్నట్టు విదేశాంగశాఖ మాట్లాడిందని సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. విద్య, క్రీడలు, పెట్టుబడుల కోసమే తన పర్యటన.. అని.. ఈ విషయం స్పష్టంగా కేంద్ర ప్రభుత్వానికి వెల్లడించామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. గుజరాత్ సీఎం పర్యటనలకు అనుమతించారు.. కానీ.. తమను అవమానించారన్నారు. తెలంగాణ సీఎంకు అనుమతివ్వరా..? నాలుగు కోట్ల ప్రజలకు అవమానం జరిగిందంటూ సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. గుజరాత్ ఆధిపత్యానికి ఇదే నిదర్శనమని పేర్కొన్నారు. ఇది తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవడమేనని పేర్కొన్నారు. తెలంగాణ బీజేపీ ఎంపీలకు అభివృద్ధి అవసరం లేదా..? వాళ్లు గుజరాత్ ను సపోర్ట్ చేస్తున్నారా..? అంటూ సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు.