
సీఎం రేవంత్ రెడ్డి, గీత దంపతులకు ప్రేమికులుగా ఎన్నో మధురానుభూతులు ఉన్నాయి. ఈ దంపతులకు నాగార్జున సాగర్తో ప్రత్యేక అనుబంధం ఉంది. వారి ప్రేమ.. నాగార్జున సాగర్లోనే మొగ్గ తొడిగింది. తమ ప్రేమ, పెళ్లి విషయాలను పలు సందర్భాల్లో సీఎం రేవంత్, సతీమణి గీత వెల్లడించారు. ఇంటర్ చదువుతున్న సమయంలో నాగార్జున సాగర్కు వచ్చిన రేవంత్రెడ్డికి గీతతో ఇక్కడే తొలి పరిచయం ఏర్పడింది. గీత కజిన్కు రేవంత్ ఫ్రెండ్ కాగా.. ఆ సమయంలో టూర్ కోసం వీరు నాగార్జున సాగర్ వెళ్లారు. సాగర్లో ఏర్పడిన పరిచయం కాస్తా స్నేహంగా, ఆ తర్వాత ప్రేమగా మారింది. ముందు వీరి ప్రేమను గీత తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. కాల పరీక్షను తట్టుకుని చివరకు అందర్నీ ఒప్పించి 1992లో పెద్దల అంగీకారంతో కలకాలం నిలిచే పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు.
ఒకప్పుడు నాగార్జున సాగర్ నీలి అలల పక్కన మొగ్గ తొడిగిన ఆ అమృత ప్రణయం… నేడు మూడు దశాబ్దాల పదిలమైన ముచ్చటైనా నాటి జ్ఞాపకాలను మీటుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నాగార్జునసాగర్లో నిర్వహించిన మహా వరుణ యాగానికి సోమవారం సీఎం రేవంత్ రెడ్డి- గీత దంపతులు హాజరయ్యారు. మహా వరుణయాగం పూర్ణాహుతి కార్యక్రమంలో సీఎం రేవంత్ దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా సీఎం దంపతులు నాగార్జునసాగర్ జలాశయాన్ని సందర్శించారు. 34 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం తర్వాత, నాటి తీపి గురుతులను మళ్లీ ఒకసారి గుర్తు చేసుకుంటూ నాగార్జున సాగర్ ఒడ్డున ఆ దంపతులు ఆత్మీయ క్షణాలు
గడిపారు. ఆనాడు ఫొటో దిగిన నాగార్జున సాగర్లో రేవంత్ దంపతులు మళ్లీ ఫొటో దిగారు. మూడు దశాబ్దాల తర్వాత అదే ప్రాంతంలో రేవంత్-గీత కలిసి ఉన్న నాటి ప్రేమికులు- నేటి సీఎం దంపతుల ఫొటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
రాష్ట్ర పాలన వ్యవహారాల్లో నిరంతరం బిజీగా ఉండే సీఎం రేవంత్ రెడ్డిలోని ఒక సున్నితమైన ప్రేమికుడిని, వారి అపూర్వ దాంపత్య బంధాన్ని ఆవిష్కరించిన ఈ అరుదైన దృశ్యం… ఇప్పుడు ప్రతి ఒక్కరి హృదయాలను హత్తుకుంటోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.