
నాన్ వెజ్ ప్రియులకు గుడ్న్యూస్. చికెన్ ధరలు భారీగా పడిపోతున్నాయి. మొన్నటివరకు పండుగలు, జాతరలు ఉండటంతో చికెన్ ధరలు భారీగా పెరిగాయి. కానీ సంక్రాంతి, మేడారం జాతర ముగిసిన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ధరలు దిగొస్తున్నాయి. గత నెలలో సంక్రాంతి, మేడారం జాతర ఉండటంతో వివిధ ప్రాంతాలకు కోళ్ల సరఫరా పెరిగిపోయింది. డిమాండ్ ఎక్కువగా ఉండటం, కోళ్ల ఉత్పత్తి తక్కువగా ఉండటంతో ధరల్లో పెరుగుదల నమోదైంది. కానీ ఇప్పుడు పండుగలు ఏమీ లేవకపోవడంతో డిమాండ్ తగ్గింది. ఈ కారణంతో గత కొద్దిరోజులుగా చికెన్ ధరలు తగ్గుతూ వస్తోండటంతో సామాన్యులకు భారం తగ్గుతుంది. ఇక నాన్ వెజ్ తినేవారికి ఖర్చు తగ్గడంతో ఊరట చెందుతున్నారు.
గత నెలలో చికెన్ ధరలు పెరిగాయి. ఏకంగా కేజీ రూ.300కిపైగా చేరుకుంది. అయితే గత పది రోజులుగా ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. కోళ్ల ఉత్పత్తి పెరగడం, డిమాండ్ తగ్గడంతో చికెన్ ధరలు కుప్పకూలుతున్నాయి. ప్రస్తుతం కిలో చికెన్ రూ.240కే లభిస్తోంది. గత నెలతో పోలిస్తే రూ.100 మేర ధర తగ్గింది. రిటైల్ మార్కెట్లో లైవ్ చికెన్ రూ.140గా కొనసాగుతోండగా.. డ్రెస్డ్ రూ.220గా ఉంది. స్కిన్లెస్ కేజీ చికెన్ రూ.240 నుంచి 250 మధ్య పలుకుతోంది. ప్రాంతాలను బట్టి ధరల్లో అటుఇటుగా మార్పులు ఉంటాయి. ప్రస్తుతం కోళ్ల ఫారాల్లో ఉత్పత్తి పెరడంతో కోళ్ల లభ్యత కూడా ఎక్కువగా ఉంది. దీంతో చికెన్ ధరలు తగ్గినట్లు వ్యాపారులు చెబుతున్నాయి. ఇక కోళ్ల ఉత్పత్తి మరింతగా తగ్గితే ధరలు ఇంకా ఎక్కువగా తగ్గే అవకాశముందని చెబుతున్నారు.
ఇక మొన్నటివరకు ఒక్కో కోడిగుడ్డు రూ.9 వరకు పలకగా.. ఇప్పుడు తగ్గుతూ వస్తోన్నాయి. రెండు నెలల పాటు అదే ధర వద్ద గుడ్ల ధరలు కొనసాగాయి. అయితే ఇప్పుడు ధరలు ఒక్కసారిగా తగ్గాయి. ప్రస్తుతం ఒక్కో గుడ్డు రూ.6కే లభిస్తోంది. దీంతో సామాన్యులకు ఇది మంచి పరిణామంగా చెప్పవచ్చు. ప్రతీ ఇంట్లో ఖచ్చితంగా గుడ్లు వాడుతూ ఉంటారు. సామాన్యుడికి బడ్జెట్లో దొరికే గుడ్లు.. కొన్నిచోట్ల రూ.10కి కూడా చేరుకున్నాయి. ఇక నాటుకోడి గుడ్లు రూ.20 వరకు పలికాయి. ఇప్పుడు చికెన్ ధరతో పాటు కోడిగుడ్ల ధరలు కూడా ఆమాంతం తగ్గిపోతున్నాయి. దీంతో సామాన్యులకు ఇంటి ఖర్చులకు అయ్యే సొమ్ము తగ్గుతుంది. కాగా ఇటీవల సంక్రాంతి సందర్భంగా కేజీ బ్రాయిలర్ చికెన్ రూ.350 పలకగా.. మటన్ రూ.1500కి చేరుకుంది. ఇక నాటుకోడి చికెన్ అయితే ఏకంగా రూ.3 వేలకు చేరుకుని రికార్డ్ సృష్టించింది.