
తెలంగాణ రైతులకు ఊరటనిచ్చే కీలక నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ 2025-26కు సంబంధించి తెలంగాణ నుంచి సేకరించే బియ్యం పరిమాణాన్ని 35 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 43 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. అంటే అదనంగా 8 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సేకరించేందుకు అనుమతి ఇచ్చింది. ఇది సుమారు 64 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యానికి సమానమని కేంద్రం పేర్కొంది. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.
ఈ నిర్ణయంపై కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణలో ఈసారి ధాన్యం ఉత్పత్తి పెరిగే అవకాశాలను దృష్టిలో పెట్టుకుని బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలిసి జూలై 8న కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజాపంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిని కలిసి బియ్యం సేకరణ లక్ష్యాన్ని పెంచాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. ఆ విజ్ఞప్తిని సానుకూలంగా పరిశీలించిన కేంద్ర ప్రభుత్వం అదనంగా 8 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం సేకరణకు ఆమోదం తెలిపిందన్నారు.
ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ ప్రారంభానికి ముందే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు సంయుక్తంగా తెలంగాణ నుంచి 35 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం, అంటే సుమారు 52 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని సేకరించాలని నిర్ణయించినట్లు కిషన్ రెడ్డి గుర్తు చేశారు. అయితే రాష్ట్రంలో ఈసారి అధిక దిగుబడులు వచ్చే అవకాశాలు ఉండటంతో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా కొనుగోలు లక్ష్యాన్ని పెంచాలని కేంద్రాన్ని కోరామని, అందుకు అనుగుణంగా కేంద్రం సానుకూల నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు.
తెలంగాణ రైతుల పరిస్థితులను అర్థం చేసుకుని బియ్యం సేకరణను పెంచేందుకు అంగీకరించిన ప్రధాని నరేంద్ర మోదీకి, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి కిషన్ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని వేలాది మంది రైతులకు ప్రయోజనం చేకూరుతుందని, పండించిన ధాన్యానికి మార్కెట్ లభించే అవకాశాలు మరింత మెరుగవుతాయని ఆయన అన్నారు.
అదే సమయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కిషన్ రెడ్డి కీలక సూచనలు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అదనపు అవకాశాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని, కేంద్రానికి ఇచ్చిన కమిట్మెంట్ ప్రకారం బియ్యాన్ని సేకరించి భారత ఆహార సంస్థ (FCI)కు నిర్ణీత గడువులోగా అందజేయాలని కోరారు. గత మార్కెటింగ్ సీజన్లలో రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిన పరిమాణంలో బియ్యాన్ని ఎఫ్సీఐకి సకాలంలో అప్పగించలేకపోయిందని, పలుమార్లు అదనపు గడువు కోరాల్సి వచ్చిందని విమర్శించారు. కనీసం ఈసారి సమర్థవంతమైన ప్రణాళికతో కొనుగోళ్లు నిర్వహించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం సేకరణ పూర్తి చేయాలని, గత బకాయిలతో పాటు తాజాగా పెంచిన కోటాకు సంబంధించిన బియ్యాన్ని కూడా ఎఫ్సీఐకి నిర్దేశిత గడువులోగా అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. దీంతో తెలంగాణలో ధాన్యం కొనుగోళ్ల అంశం మరోసారి రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
𝐒𝐭𝐫𝐞𝐧𝐠𝐭𝐡𝐞𝐧𝐢𝐧𝐠 𝐭𝐡𝐞 𝐡𝐚𝐧𝐝𝐬 𝐨𝐟 𝐭𝐡𝐞 𝐟𝐚𝐫𝐦𝐞𝐫𝐬 𝐨𝐟 𝐓𝐞𝐥𝐚𝐧𝐠𝐚𝐧𝐚.
I express my deep gratitude to Hon’ble Prime Minister Shri @narendramodi Ji and Hon’ble Union Minister of Consumer Affairs, Food and Public Distribution, Shri @JoshiPralhad Ji for… pic.twitter.com/GRXpPaTQ3N
— G Kishan Reddy (@kishanreddybjp) July 22, 2026
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..