
కేంద్ర ప్రభుత్వం ఆదివారం ప్రకటించిన బడ్జెట్లో తెలంగాణకు అంతగా కేటాయింపులు జరగలేదు. ఏపీలోని రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణాలకు కేంద్రం నిధులు కేటాయించగా.. హైదరాబాద్ నుంచి మూడు హైస్పీడ్ రైలు కారిడార్లు మినహా తెలంగాణకు పెద్దగా ఏమీ లేదు. ఇక బడ్జెట్లో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకానికి కేంద్రం నిధులు కేటాయించింది. ఈ పథకం అమలుకు కేంద్రం తన వాటా అందించనుంది. ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకునేవారికి రాష్ట్ర ప్రభుత్వంతో కలిపి మోదీ ప్రభుత్వం ఆర్ధిక సాయం అందించనుంది. ఇందుకోసం ఈ స్కీమ్ కింద పట్టణాల్లో ఇల్లు నిర్మించుకునేవారికి రూ.1.50 లక్షలు, గ్రామాల్లోని లబ్దిదారులకు రూ.72 వేలు కేంద్రం అందించనుంది.
రాష్ట్రంలో 4.13 లక్షల ఇళ్లకు పీఎం ఆవాస్ యోజన పథకం కింద కేంద్రం నిధులు కేటాయించింది. 2026-27 ఆర్ధిక సంవత్సరంలో 13 లక్షల ఇళ్లకు వాటా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. అయితే రాబోయే ఆర్ధిక సంవత్సరంలో రాష్ట్రానికి 1.13 లక్షల ఇళ్లు కేంద్రం పీఎంఏవై అర్బన్ 2.0 పథకంలో భాగంగా కేటాయించింది. ఈ రైళ్లకు కేంద్రం తన వాటాగా రూ.1.50 లక్షల చొప్పున లబ్దిదారులకు ఇవ్వనుండగా.. ఇందుకోసం రూ.1,690 కోట్లు కేటాయించింది. డబుల్ బెడ్ రూం ఇల్లు నిర్మించుకున్న 33 వేల ఇళ్లకు అందించేందుకు కేంద్రం రూ.500 కోట్లు కేటాయించింది. పీఎంఏవై గ్రామీణ పథకంలో భాగంగా 25 లక్షల ఇళ్లకు కేంద్రం వాటా ఇవ్వాలని నిర్ణయించింది.
కేంద్రం ప్రకటించిన నిధులతో గ్రామీణ ప్రాంతాల్లో 3 లక్షల ఇళ్లు రానున్నాయి. ఒక్కొ ఇంటికి రూ.72 వేల చొప్పున రూ.2,160 కోట్లు కేంద్రం కేటాయించింది. ఇక ఆదివాసీల కోసం 10 వేల ఇళ్లను కేంద్రం ప్రకటించగా.. ఇందుకు సంబంధించి ఒక్కొ ఇంటికి రూ.1.20 లక్షలు రానుంది. కాగా రేవంత్ సర్కార్ ఇప్పటికే రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇళ్లను నిర్మిస్తోంది. దశలవారీగా లబ్దిదారులను ఎంపిక చేస్తూ ఇళ్లను మంజూరు చేస్తోంది. మార్చి నుంచి కొత్త ఇళ్లను మంజూరు చేసేందుకు సిద్దమవుతోంది. ఈ క్రమంలో ఇందిరమ్మ ఇళ్ల పథకంలో కేంద్రం తన వాటా ఇవ్వనుండటంతో రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఊరట కలిగింది. కేంద్ర ప్రభుత్వం పీఎం ఆవాస్ యోజన, పీఎంఏవై అర్బన్, పీఎంఏవై గ్రామీణ పథకాలను అమలు చేస్తోంది. వీటి ద్వారా ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకునేవారికి కేంద్రం వాటా అందనుంది. ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని కాంగ్రెస్ సర్కార్ కీలకంగా తీసుకున్న సమయంలో కేంద్రం తన వాటా కేటాయించడంతో ప్రభుత్వ వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి.