CM KCR: తగ్గేదేలే.. బీఆర్ఎస్ హ్యాట్రిక్ వ్యూహం.. రంగంలోకి సీఎం కేసీఆర్.. ఇక ‘కారు’ టాప్ గేర్‌లోనే..

తెలంగాణలో వరుసగా రెండుసార్లు అధికారంలోకి వచ్చిన బీఆర్‌ఎస్‌ వచ్చే అసెంబ్లీ ఎన్నికలకోసం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. కొట్లాడి తెలంగాణ తెచ్చిన పార్టీగా.. సొంత ఇమేజ్‌ని కాపాడుకుంటూ హ్యాట్రిక్‌ విక్టరీ కొట్టాలన్న టార్గెట్‌తో గులాబీపార్టీ దూసుకెళ్తోంది. ప్రతిపక్షాలకంటే చాలాముందే ఏకకాలంలో అభ్యర్థులను ప్రకటించి సవాల్‌ విసిరింది బీఆర్‌ఎస్‌.

CM KCR: తగ్గేదేలే.. బీఆర్ఎస్ హ్యాట్రిక్ వ్యూహం.. రంగంలోకి సీఎం కేసీఆర్.. ఇక ‘కారు’ టాప్ గేర్‌లోనే..
CM KCR

Updated on: Oct 09, 2023 | 8:22 PM

తెలంగాణలో వరుసగా రెండుసార్లు అధికారంలోకి వచ్చిన బీఆర్‌ఎస్‌ వచ్చే అసెంబ్లీ ఎన్నికలకోసం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. కొట్లాడి తెలంగాణ తెచ్చిన పార్టీగా.. సొంత ఇమేజ్‌ని కాపాడుకుంటూ హ్యాట్రిక్‌ విక్టరీ కొట్టాలన్న టార్గెట్‌తో గులాబీపార్టీ దూసుకెళ్తోంది. ప్రతిపక్షాలకంటే చాలాముందే ఏకకాలంలో అభ్యర్థులను ప్రకటించి సవాల్‌ విసిరింది బీఆర్‌ఎస్‌. సిట్టింగ్‌లలో కొందరిపై వ్యతిరేకత ఉన్నా.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ చరిష్మాకు తోడు ప్రభుత్వ పథకాలతో ప్రజల మళ్లీ తమకే పట్టం కడతారన్న నమ్మకంతో ఆ పార్టీ ఉంది. విపక్షాలు బలం పుంజుకున్నచోట తనదైన వ్యూహంతో బీఆర్‌ఎస్‌ ముందుకెళ్తోంది. నిజామాబాద్‌ జిల్లా కామారెడ్డినుంచి పోటీకి కేసీఆర్‌ నిర్ణయించుకోవడం ఆ వ్యూహంలో భాగమే. 2019ఎన్నికల్లో నిజామాబాద్‌ ఎంపీగా పోటీచేసి ఓడిపోయారు కవిత. కేసీఆర్‌ కామారెడ్డిని ఎంచుకోవడానికి ఇది కూడా ఓ కారణం. తాను పోటీచేస్తే ఆ ప్రభావం కేవలం జిల్లావ్యాప్తంగా ఉంటుందని, చుట్టుపక్కల జిల్లాలపైనా దాని ఎఫెక్ట్‌ ఉంటుందన్నది బీఆర్‌ఎస్‌ అధినేత అంచనా. అందుకే మొదట్నించీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు తమకు కంచుకోటలా ఉన్న ఉత్తర తెలంగాణపై ఫోకస్‌ పెంచారు.

అధినేతకు తోడుగా పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, మంత్రి హరీష్‌రావు పర్యటనలతో పార్టీ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్‌ రావడంతో ఇక అధినేత కూడా రంగంలోకి దిగుతున్నారు. సంక్షేమపథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తోంది బీఆర్‌ఎస్‌. తాము అధికారంలోకి రాకముందు వచ్చిన తర్వాత వచ్చిన మార్పుని ప్రజలు గమనించారంటోంది. అధికారంలోకి రావాలని తాపత్రయపడుతున్న కాంగ్రెస్‌, బీజేపీ ప్రజలకు ఏం చేశాయని బీఆర్‌ఎస్‌ నేతలు ప్రశ్నిస్తున్నారు. బీజేపీ అగ్రనేతలు రంగంలోకి దిగడం, కాంగ్రెస్‌ హామీలతో బీఆర్‌ఎస్‌ కూడా మరిన్ని ప్రజాకర్షక హామీలు, పథకాలకు సిద్ధమవుతోంది. తన మేనిఫెస్టోతో విపక్షాల ఎత్తులను చిత్తు చేయాలనుకుంటోంది. రెండుసార్లు అధికారంలో ఉండటంతో సహజంగా ఉండే ప్రజావ్యతిరేకతతో నష్టం జరగకుండా చూసుకునే వ్యూహంతో ఆ పార్టీ ఉంది. ఎంఐఎం మద్దతుతో మైనారిటీ ఓటుబ్యాంక్‌ చేజారకుండా జాగ్రత్తపడే ప్రయత్నాల్లో ఉంది. కాంగ్రెస్‌, బీజేపీ రెంటినీ టార్గెట్‌ చేసుకుంటూ ప్రచారంలో స్పీడ్‌ పెంచారు బీఆర్‌ఎస్‌ అగ్రనేతలు.

ఎన్నికల షెడ్యూల్ విడుదలవ్వడంతో.. సీఎం కేసీఆరే ఇక రంగంలోకి దిగనున్నారు. వరుస బహిరంగ సభలు.. ఎమ్మెల్యే అభ్యర్థులతో భేటీ.. వ్యూహాలకు ప్రతివ్యూహాలను రచిస్తూ.. విపక్ష పార్టీలకు సవాల్ విసరనున్నారు. ఇప్పటికే.. సీఎం కేసీఆర్ పర్యటనలకు సంబంధించిన షెడ్యూల్ సైతం విడుదలయ్యింది. దీంతో బీఆర్ఎస్ నేతలు ఆ సభలను విజయవంతం చేసేందుకు రెట్టింపు ఉత్సాహంతో ముందుకెళ్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..