Telangana: కాంగ్రెస్‌ నేతలు నోటికి ఏది వస్తే అది హామీ ఇచ్చారు- కేటీఆర్

|

Jan 11, 2024 | 10:10 PM

కాంగ్రెస్‌ అబద్ధాల ముందు అభివృద్ధి ఓడిపోయిందన్నారు కేటీఆర్. ప్రజలు బీఆర్ఎస్‌ను పూర్తిగా తిరస్కరించలేదని.. ఎవరూ నిరుత్సాహపడొద్దని గులాబీ నేతలకు సూచించారు. రైతుబంధుపై మంత్రులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి.. గందరగోళానికి గుర్తిచేస్తున్నారన్నారు నిరంజన్‌ రెడ్డి.

Telangana: కాంగ్రెస్‌ నేతలు నోటికి ఏది వస్తే అది హామీ ఇచ్చారు- కేటీఆర్
KTR
Follow us on

 

లోక్‌సభ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి పెట్టిన బీఆర్ఎస్‌ పార్టీ వరుస సమావేశాలు నిర్వహిస్తోంది. పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అధ్యక్షతన హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఈ సమీక్షలు కొనసాగుతున్నాయి. మహబూబాబాద్‌ సెగ్మెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహంపై నేతలకు బీఆర్ఎస్ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ దిశానిర్దేశం చేశారు.

పనుల కంటే ప్రచారంపై ఫోకస్‌ చేసుంటే గెలిచేవాళ్లమన్నారు కేటీఆర్. మనం చేసిన పనిని కూడా చెప్పుకోవడంలో విఫలమయ్యామన్నారు. కాంగ్రెస్‌ నేతలు నోటికి ఏది వస్తే ఆ హామీ ఇచ్చారని.. తప్పుడు ప్రచారాన్నే ప్రజలు నమ్మారన్నారు. కాంగ్రెస్‌ అబద్ధాల ముందు అభివృద్ధి ఓడిపోయిందన్నారు. ప్రజలు బీఆర్ఎస్‌ను పూర్తిగా తిరస్కరించలేదని.. ఎవరూ నిరుత్సాహపడొద్దని సూచించారు కేటీఆర్. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ మధ్య ఓట్ల తేడా 1.85 శాతమే ఉందన్నారు.

అధికారంలో ఉన్నప్పుడు పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టలేకపోయామన్నారు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్. ప్రజలు అడిగినవి, అడగని పథకాలు అమలు చేసినా.. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే ఇంకేదో ఇస్తుందని ప్రజలు ఆశపడ్డారన్నారు. కానీ పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురుతుందన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం భయపడుతోందని విమర్శించారు.

ప్రభుత్వ పెద్దలు ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదన్నారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. రైతుబంధు అందరికి వచ్చిందని డిప్యూటీ సీఎం చెప్తుంటే.. సంక్రాంతి తర్వాత రైతుబంధు ఇస్తామని వ్యవసాయ శాఖ మంత్రి చెప్తున్నారన్నారు. మంత్రులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి రైతులను గందరగోళానికి గురి చేస్తున్నారన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..