Dharmapuri Arvind: ఎంపీ అరవింద్ ఇంటిపై దాడి కేసు.. పోలీసుల రిమాండ్ రిపోర్ట్లో కీలక విషయాలు..
టీఆర్ఎస్, బీజేపీ మధ్య రాజకీయం పచ్చగడ్డి వస్తే భగ్గుమన్నట్లుగా మారింది. కాగా, ఎంపీ అర్వింద్ ఇంటిపై దాడి కేసులో పోలీసులు రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలను ప్రస్తావించారు.
Dharmapuri Arvind House Attack Case : టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై.. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాలను మరింత హీటెక్కించాయి. దీంతో టీఆర్ఎస్ కార్యకర్తలు.. హైదరాబాద్లోని ధర్మపురి అరవింద్ ఇంటిపై దాడిచేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత.. ఎంపీ అరవింద్ కూడా ఘాటుగా విమర్శలు గుప్పించారు. దీంతో టీఆర్ఎస్, బీజేపీ మధ్య రాజకీయం పచ్చగడ్డి వస్తే భగ్గుమన్నట్లుగా మారింది. కాగా, ఎంపీ అర్వింద్ ఇంటిపై దాడి కేసులో పోలీసులు రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలను ప్రస్తావించారు. కవితపై వ్యాఖ్యలకు నిరసనగానే ఎంపీ ధర్మపురి అరవింద్ ఇంటిపై దాడి చేసినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. కవితపై పదేపదే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని..దానికి నిరసనగానే దాడి జరిగినట్లు వివరించారు. ప్రెస్మీట్లను పెట్టి తరచూ కవితను టార్గెట్ చేశారని.. అనంతరం సోషల్ మీడియాలో సైతం వైరల్ చేశారని పేర్కొన్నారు.
కాగా.. ఎంపీ అరవింద్ ఇంటిపై దాడి చేసిన తొమ్మిది మందిలో ఇద్దరు పీహెచ్డీ స్టూడెంట్స్ ఉన్నట్లు రిమాండ్ రిపోర్టులో తెలిపారు. ఎంపీ ఇంటి దగ్గర పూర్తిస్థాయి బందోబస్తు లేకపోవడంతో దాడికి పాల్పడినట్లు వివరించారు. ఇంట్లో పూజ సామగ్రి, హాల్ ధ్వంసంతో పాటు కారుపై దాడి చేశారన్నారు. ఈ ఘటనలో 2 సిమెంట్ రాళ్లు, 2 కర్రలు, టీఆర్ఎస్ జెండాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అయితే, నిందితులకు పోలీసుల 41 సీఆర్పీసీ నోటీస్ ఇవ్వకుండా అరెస్ట్ చేయడంతో కోర్టు బెయిల్ మంజూరు చేసినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో ప్రస్తావించారు.
ఇదిలాఉంటే.. అరవింద్ ఇంటిపై దాడి కేసులో జాగృతి నవీనాచారి, జాగృతి కన్వీనర్ రాజీవ్ సాగర్ పేర్లు కనిపించలేదు. ఇప్పటికే.. ఈ కేసులో నిందితులను అరెస్టు చేసిన పోలీసులు.. నాంపల్లి కోర్టులో హాజరుపర్చారు. అనంతరం కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..