
హిందూ ప్రధాన పండగలలో ఒకటైన శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో నిర్వహించే కళ్యాణ బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం అత్యంత వైభవంగా జరుగుతాయి. ఈ సంవత్సరం ఈ ఉత్సవాలు మార్చి 19 నుంచి ఏప్రిల్ 2 వరకు నిర్వహించనున్నట్లు దేవాదాయ శాఖ వెల్లడించింది. ఈ ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన శ్రీ సీతారాముల వార్షిక కల్యాణం ఈ సంవత్సరం మార్చి 27న జరుగుతుంది. ఈ పవిత్ర కార్యక్రమాన్ని భక్తులు ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఆలయ అధికారులు ప్రత్యేకంగా సెక్టార్లను ఏర్పాటు చేశారు. ఈ సెక్టార్ టికెట్లను భక్తులు భద్రాచలం దేవస్థానం అధికారిక వెబ్సైట్ https://bhadradritemple.telangana.gov.in/ ద్వారా ఆన్లైన్లో బుక్ చేసుకునే అవకాశం కల్పించారు.
వెబ్సైట్లోకి వెళ్లిన తర్వాత హోమ్ పేజీలో కనిపించే “శ్రీరామనవమి టికెట్” లింక్పై క్లిక్ చేసి, అందులో ఉన్న కల్యాణం సెక్టార్ లేదా పట్టాభిషేకం సెక్టార్ ఎంపిక చేసుకుని నిర్ణయించిన ఫీజు చెల్లించి టికెట్ బుక్ చేసుకోవచ్చు.
భద్రాచలానికి ప్రత్యక్షంగా రాలేని భక్తుల కోసం కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వారు అదే వెబ్సైట్ ద్వారా రూ.5,000 లేదా రూ.1,116 టికెట్లు బుక్ చేసి, తమ గోత్రనామాలతో సీతారాముల కల్యాణం నిర్వహించుకునే అవకాశం ఉంది.
భద్రాచలం సీతారాముల కల్యాణంలో ఉపయోగించే తలంబ్రాలకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది. ఈ తలంబ్రాలను పొందాలనుకునే భక్తుల కోసం టీజీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ సేవలు అందుబాటులో ఉన్నాయి.
భక్తులు రూ.151 చెల్లించి తలంబ్రాలను ఆన్లైన్లో బుక్ చేసుకుంటే వాటిని ఇంటికే పంపించే సదుపాయం కల్పించారు.
లింక్ ఇదే.. https://tgsrtclogistics.co.in/TSRTC/
లేదా సమీపంలోని టీజీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ కౌంటర్లలో కూడా బుకింగ్ చేసుకోవచ్చు.
సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు: 040-69440069, 040-23450033
మార్చి 28న శ్రీరాముడి పట్టాభిషేకం నిర్వహించనున్నారు.
సంప్రదాయం ప్రకారం కొత్తగా బాధ్యతలు చేపట్టిన గవర్నర్ శివప్రతాప్ శుక్లాను ఈ వేడుకలకు ఆహ్వానించనున్నారు. గత ఏడాది సుమారు 4 లక్షల ముత్యాల తలంబ్రాల ప్యాకెట్లు విక్రయించగా, ఈ సంవత్సరం 5 లక్షలకు పైగా తయారు చేయాలని అధికారులు నిర్ణయించారు.
సుమారు 2 లక్షల చిన్న లడ్డూలు, 400 గ్రాముల మహా లడ్డూలు (రూ.100) – 3 వేలకుపైగా సిద్ధం చేస్తున్నారు. శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలం దేవస్థానానికి దేశం నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివస్తారు. ఈ సందర్భంగా టీజీఎస్ఆర్టీసీ, ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులు కూడా నడపనున్నాయి.