
నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న వసంత మృతి కేసులో ట్విస్ట్ల మీద ట్విస్టులు వెలుగు చూస్తున్నాయి. పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. ప్రేమ వ్యవహారం విఫలమవడం తోనే వసంత ఆత్మహత్య చేసుకుందని తెలుస్తోంది. వనపర్తి జిల్లా పాంగల్ మండల అన్నారం తండాకు చెందిన వసంత.. ఖిర్యాతండాకు చెందిన గణేష్ అనే యువకుడు ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. త్వరలోనే పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఇద్దరి సామాజిక వర్గం కూడా ఒకటే.. కానీ ఇరు కుటుంబాల్లో వీరి ప్రేమ వ్యవహారం ఇష్టం లేకపోవడంతో గత కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. గత రాత్రి కూడా గణేష్తో ఫోన్లో మాట్లాడింది వసంత. ఇంతలోనే ఏమైందో తెలియదు కానీ.. వసంత ఫోన్ను బ్లాక్ చేశాడు గణేష్. వాట్సాప్లోను బ్లాక్ చేయడంతో మరింత మనోవేదనకు గురైంది.
ఈ నేపథ్యంలో ఎంత ప్రయత్నించిన గణేష్ నుండి స్పందన లేకపోవడంతో ఆత్మహత్య చేసుకోవాలని వసంత నిశ్చయించుకుంది. ఇంతలోనే గణేష్ ఆత్మహత్య చేసుకున్నాడని సమాచారం అందడంతో మరింత మనోవేదనకు గురైన వసంత చేతిని కత్తితో కట్ చేసుకుంది. అక్కడితో ఆగకుండా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గంటల వ్యవదిలోనే ప్రేమికులు ఇద్దరు చనిపోవడంతో ఇటు ట్రిపుల్ ఐటీలో అటు వనపర్తి జిల్లాలో విషాద చాయలు అలుముకున్నాయి. నువ్వు లేని లోకంలో నేను ఉండలేనంటూ ఒకరి తర్వాత ఒకరు ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది.
బాసర ట్రిపుల్ ఐటిలో ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న వసంత.. యమునా గర్ల్స్ హాస్టల్లో ఉంటుంది. గత రాత్రి ఓ ఫోన్ రావడంతో భయాందోళనకు గురైంది. అయితే ఆ ఫోన్ చేసింది ఎవరు.. ఎందుకు వసంత ఆత్మహత్య చేసుకుంది. ఉరి వేసుకున్న వసంత చేతిపై గాయాలు ఎందుకు ఉన్నాయి.. ఉరి వేసుకునే కంటే ముందే చేతులు, గొంతుపై గాయం చేసుకుందా.. పోలీసులు చెబుతున్న ప్రాథమిక సమాచారంలో నిజమెంత అనే విషయాలు నిగ్గు తేలాల్సి ఉంది. వసంత మృతదేహాన్ని బైంసా ఏరియా ఆస్పత్రికి తరలించగా.. లావుడ్యా గణేష్ మృతదేహాన్ని హైదరబాద్ నుండి స్వస్థలం ఖిర్యా తండాకు తరలించారు.