తప్పు చేస్తే కొడుకుకైనా శిక్ష పడాల్సిందే.. భగీరథ్‌ అంశంపై బండి సంజయ్ ఏమన్నారంటే?

తన కుమారుడిపై వస్తున్న ఆరోపణలపై తొలిసారిగా స్పందించారు కేంద్రమంత్రి బండి సంజయ్. తన కుమారుడిని క్రిమినల్‌లా చూపే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. తప్పు చేస్తే తన కుమారుడైనా శిక్ష అనుభవించాల్సిందేనని, తప్పు ఎవరు చేసినా సమర్థించేది లేదని స్పష్టం చేశార. చట్టం ముందు అందరూ సమానమేనని, తన కుటుంబంపై కొంతమంది రాళ్లు వేస్తున్నారని ఆయన చెప్పుకొచ్చారు. ఎవరు ఎన్ని చేసినా తాను కంటతడి పెట్టనన్నారు.

తప్పు చేస్తే కొడుకుకైనా శిక్ష పడాల్సిందే.. భగీరథ్‌ అంశంపై బండి సంజయ్ ఏమన్నారంటే?
Bandi Sanjay On Son's Allegations

Updated on: May 13, 2026 | 7:40 AM

కరీంనగర్ వేదికగా జరిగిన హిందూ ఏక్తా యాత్రలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తన కుమారుడిపై వస్తున్న ఆరోపణలపై స్పందించారు. హిందువుల ఐక్యతను చాటేందుకే గత 16 ఏళ్లుగా ఈ హిందూ ఏక్తా యాత్రను నిర్వహిస్తున్నట్లు బండి సంజయ్ తెలిపారు. కరీంనగర్ టవర్ సర్కిల్ పై కాషాయ జెండాను ఎగరేశాం. ఈ గడ్డ రక్తం నాలో ప్రవహిస్తోంది. గల్లీగల్లీలో ప్రజా సమస్యలపై కొట్లాడిన చరిత్ర నాది అన్నారు. జై శ్రీరాం అనే నినాదమే హిందూ ధర్మాన్ని కాపాడుతుందని.. హిందూ సమాజానికి ఆపదొస్తే జై శ్రీరాం నినాదంతో తెగించి కొట్లాడతాం అని స్పష్టం చేస్తూ కరీంనగర్ ప్రజలకు హ్యాట్సాఫ్ చెప్పారు.

తన ప్రస్థానం ఒక సాధారణ కార్యకర్తగా మొదలైందని, తన జీవితం అంతా కష్టాలు, బాధలతో కూడుకున్నదనే అన్నారు. హార్ట్ లో స్టంట్ ఉన్నా హార్ట్ ఫుల్ గా 1600 కిలోమీటర్లు నడిచి తెలంగాణ ప్రజల కష్టాలను పంచుకున్నాను. నాటి పాలకులు తనపై రాళ్ల దాడి చేసినా, 109 కేసులు పెట్టి జైలుకు పంపినా భయపడలేదన్నారు. బాధలను చూసి పారిపోయే వ్యక్తిని కాదని.. తానెప్పుడూ కంటతడి పెట్టననని ఆయన చెప్పుకొచ్చారు.

తన సమయమంతా సమాజానికే కేటాయించడం వల్ల సొంత కొడుకుకు సమయం ఇవ్వలేకపోయానని, అది తన తప్పేనని క్షమించమని కోరారు. కొందరు తన కొడుకును క్రిమినల్ గా చూపే ప్రయత్నం చేస్తున్నారని.. తను ఏ తప్పూ చేయలేదని తన కుమారుడు చెబుతున్నానని చెప్పుకొచ్చాడు, కానీ దాన్ని నిరూపించుకోవాలని తాను కుమారుడుకి చెప్పానన్నారు. అయినప్పటికీ తాను తన కొడుకును సమర్ధించడం లేదని..తాను చట్టాన్ని, న్యాయాన్ని గౌరవిస్తానని.. కోర్టు నిర్ణయాన్ని శిరసావహిస్తాన్నారు. తన కొడుకు తప్పుడు చేసి ఉంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చు అని అన్నారు.

వీడియో చూడండి..

ఈరోజు నా కుటుంబానికి నిప్పంటించారు. ఆ నిప్పుతో అవినీతి వ్యవస్థను దగ్దం చేస్తా. కుట్రలు చేసే గడీలను బద్దలు కొడతా అని బండి సంజయ్ అన్నారు, తన కుటుంబాన్ని, తన కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన వారిని విడిచిపెట్టే ప్రసక్తే లేదు అని గట్టిగా హెచ్చరించారు. తన భార్య కూడా తనను అనుసరిస్తూ, తాను ఉన్నా లేకున్నా కార్యకర్తలకు చేతనైన సాయం చేస్తోందని పేర్కొన్నారు. కార్యకర్తలే తన కుటుంబమని, కాషాయ జెండా పట్టి కష్టాలు పడుతున్నా బాధపడనని చెప్పారు. ధర్మం కోసం నిరంతరం పోరాడుతూనే ఉంటానని, నా చివరి శ్వాస వరకు హిందూ ధర్మం కోసమే పనిచేస్తానన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us