
బెంగాల్ ఎన్నికలు,సెక్యులర్ పార్టీలపై అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. సెక్యులర్ పార్టీలకు వేసే ముస్లిం ఓట్లు వృధా అవుతున్నాయన్నారు. ఆ పార్టీలకు ఓటు వేయడం వల్ల బీజేపీకి లాభం జరుగుతోందని.. ముస్లింలను సెక్యులర్ పార్టీలు ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తున్నాయన్నారు. సెక్యులర్ పార్టీల కారణంగా ముస్లిం జీవితాల్లో ఎలాంటి మార్పు రాలేదని.. బీజేపీని అడ్డుకోవాలంటే ముస్లింలకు తమ సొంత స్వతంత్ర నాయకత్వం అవసరమన్నారు.
ముస్లింల సమస్యలను గుర్తించి, వాటిని పరిష్కరించే నాయకత్వం కావాలన్నారు. సెక్యులర్ పార్టీలకు పాలిచ్చే ఆవుల మాదిరిగా ఎంతకాలం ఉంటారని.. ముస్లింల ఓట్లతో అధికారం పొందిన పార్టీలు మిమ్మల్ని ఎన్నటికీ ఓటర్లుగానే చూస్తున్నాయని.. పౌరులుగా చూడడం లేదన్నారు. ముస్లింల కోసం, వారి బాగు కోసం, తమ స్వరం వినిపించడం కోసం మీ సొంత నాయకత్వాన్ని ఎన్నుకోవాలన్నారు.
ముస్లింలు ఓటర్లుగా కాదు, పౌరులుగా బ్రతకాలని.. నాయకులుగా ఎదగాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే మీ ఓటు కావాలి అంటారు. కానీ మీ ఓటుతో ప్రభుత్వాలు ఏర్పడవు. ఈ విషయం గ్రహించంచాలని చెప్పుకొచ్చారు. హర్యానాలో కాంగ్రెస్, ఢిల్లీలో AAP, బెంగాల్లో TMC.. ఏ పార్టీకి ఓటేసినా మీ పరిస్థితుల్లో మార్పు రాలేదన్నారు. దేశంలో ఒక్క బెంగాల్ రాష్ట్రంలోనే 60 నియోజకవర్గాల్లో ముస్లింలు మెజారిటీగా ఉన్నారని.. అయినా కూడా అక్కడ బీజేపీ గెలుస్తుంది అంటే కారణమేంటని ప్రశ్నించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.