
మహబూబ్నగర్ జిల్లాలోని జిల్లా జైలులో సంచలన ఘటన చోటుచేసుకుంది. పోక్సో కేసులో రిమాండ్లో ఉన్న నిందితుడు కిషోర్ జైలు నుంచి పరారయ్యాడు. ఈ ఘటనతో జైలు భద్రతా వ్యవస్థపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇందుకు సంబంధించి సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
అమరచింత పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఓ పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న కిషోర్ను ఇటీవల రిమాండ్లో భాగంగా జిల్లా జైలుకు తరలించారు. అయితే, జైలులో ఉన్న సమయంలో అతను టవల్స్ను కలిపి తాడు లా తయారు చేసుకుని, అదే సహాయంతో జైలు గోడ దూకి పారిపోయినట్లు సమాచారం. ఈ ఘటన సోమవారం (జూలై 06) ఉదయం వేళలో వెలుగులోకి వచ్చింది. జైలు సిబ్బంది సాధారణ తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో కిషోర్ సెల్లో లేడని గుర్తించారు. వెంటనే జైలు పరిసర ప్రాంతాల్లో గాలింపు చర్యలు ప్రారంభించారు. అయినప్పటికీ అతని ఆచూకీ ఇప్పటివరకు లభ్యం కాలేదని తెలుస్తోంది.
పరారైన నిందితుడి కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. జైలు భద్రతలో లోపాలు ఉన్నాయా లేదా అనే కోణంలో కూడా అధికారులు విచారణ చేపట్టారు. టవల్స్ సాయంతో గోడ దూకి పరారవడం వంటి ఘటన ఎలా జరిగిందన్న అంశంపై ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటన జిల్లాలో కలకలం రేపింది. జైలు భద్రతపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పరారైన కిషోర్ను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..