Telangana PCC Chief: కొలిక్కి వచ్చిన తెలంగాణ కొత్త పీసీసీ అధ్యక్షుడు.. సీల్డ్‌ కవర్‌లో ఒకరి పేరు.. ఏ క్షణానైనా ప్రకటించే ఛాన్స్!

|

Jun 18, 2021 | 7:00 PM

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడి ఎంపిక దాదాపు పూర్తయినట్టు తెలుస్తోంది. షార్ట్ లిస్ట్‌లో ఇద్దరి పేర్లు మాత్రమే ఉన్నాయని.. వారిలో ఒకరి పేరును రేపో మాపో ఫైనల్ చేస్తారని తెలుస్తోంది.

Telangana PCC Chief: కొలిక్కి వచ్చిన తెలంగాణ కొత్త పీసీసీ అధ్యక్షుడు.. సీల్డ్‌ కవర్‌లో ఒకరి పేరు.. ఏ క్షణానైనా ప్రకటించే ఛాన్స్!
Telangana Pcc Chief
Follow us on

Telangana PCC Chief finalised: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడి ఎంపిక దాదాపు పూర్తయినట్టు తెలుస్తోంది. షార్ట్ లిస్ట్‌లో ఇద్దరి పేర్లు మాత్రమే ఉన్నాయని.. వారిలో ఒకరి పేరును రేపో మాపో ఫైనల్ చేస్తారని తెలుస్తోంది. ప్రధానంగా పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రేవంత్‌ రెడ్డిల పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. సీల్డ్ కవర్‌లో వీరిలో ఒకరి పేరు ఉన్నట్టు సమాచారం. తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్యం ఠాగూర్ మరోసారి సోనియా గాంధీతో భేటీ కానున్నారు. ఆ తర్వాత పీసీసీ చీఫ్ ఎవరన్నదానిపై క్లారిటీ వచ్చే అవకాశముంది.

టీపీసీసీ రేసులో ఉన్న రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మధుయాష్కి పోటాపోటీగా లాబీయింగ్ చేశారు. ఇప్పటికే కసరత్తు పూర్తిచేసిన అధిష్టానం, కమిటీపై క్లారిటీకి వచ్చినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మాణిక్యం ఠాగూర్ రాష్ట్రంలో 150 మందికి పైగా నేతల అభిప్రాయాలు సేకరించి తయారుచేసిన పూర్తి నివేదికను ఇప్పటికే కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి అందించారు. అన్ని జిల్లాల డీసీసీ అధ్యక్షులు, రాష్ట్ర కమిటీ నేతలు, సీనియర్ నేతల అభిప్రాయలన్నీ క్రోడీకరించారు. ఫైనల్‌గా ఇద్దరి పేర్లను పరిగణనలోకి తీసుకుని ఒకర్ని ఎంపిక చేసినట్టు సమాచారం. ఏ క్షణానైన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎవరో తేలిపోనుంది.

ఇదిలావుంటే తెలంగాణలో ఖాళీ అయిన పీసీసీ అధ్యక్షుడి ఎంపికపై కాంగ్రెస్ కసరత్తు మొదలు పెట్టడంతో ఆశావహులంతా ఢిల్లీకి క్యూ కట్టారు. తమకు ఒక్క ఛాన్స్‌ ఇవ్వాలని అధినేత్రి సోనియాగాంధీని ప్రసన్నం చేసుకున్నారు. అటు పెద్ద ఎత్తున లాబీయింగ్‌ కూడా చేశారు. సీల్డ్‌ కవర్‌లో పేరు సిద్ధమైందనే సమాచారంతో చివరి ప్రయత్నాలు మొదలు పెట్టారు. అయితే మరికొందరు మాత్రం మళ్లీ అభిప్రాయసేకరణ జరగాలంటున్నారు.

అయితే టీపీసీసీ అధ్యక్షుడి ఎంపికపై సోనియాగాంధీకి లేఖ రాశారు కొందరు తెలంగాణ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు. కొత్త టీపీసీసీ అధ్యక్షుడిని ఎంపిక చేసే ముందు వారి ట్రాక్‌ రికార్డ్‌ చూడాలని అధిష్టానానికి విన్నవించారు. కాంగ్రెస్‌ ఐడియాలజీతో పాటు గాంధీ కుటుంబానికి విశ్వాసపాత్రులుగా ఉన్న వారినే ఎంపిక చేయాలని లేఖలో కోరారు.

అయితే, టీపీసీసీ అధ్యక్షుడి నియామకంపై ఇంకా సమయం ఉందని ఇప్పడప్పుడే కాదని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి చెప్పుకొచ్చారు. తనకు పీసీసీ అధ్యక్షుడిగా ఎన్నుకోవాలని సోనియాకు, రాహుల్‌కు లేఖ రాశానని, లేదంటే వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఇవ్వాలని కోరానని తెలిపారు. కాంగ్రెస్‌ అధిష్టానం ఎవరిని టీపీసీసీ అధ్యక్షుడిగా ఎన్నుకున్నా, కలిసికట్టుగా పనిచేస్తామని చెప్పారు. మరోవైపు త్వరలోనే టీపీసీసీ అధ్యక్షుడి పేరును అధిష్టానం ప్రకటిస్తుందంటున్నారు ఏఐసీసీ సెక్రటరీ మధుయాష్కీ. లాక్‌డౌన్‌ వల్లే ఎంపిక ఆలస్యమైందంటున్నారు.

ఒకవైపు టీపీసీసీ అధ్యక్షుడి ఎంపిక క్లైమాక్స్‌కు చేరడంతో మరికొందరు మాత్రం, అధిష్టానానికి లేఖలు రాస్తున్నారు. దీంతో కాంగ్రెస్‌ హైకమాండ్‌ ఎవరిని ఎంపిక చేస్తుందనేది ఆసక్తి రేపుతోంది.

Read Also…  KTR : గృహ ప్రవేశాల ముహూర్తాలు ఖరారు : ఇక గ్రేటర్ హైదరాబాద్ లో అంబరాన్నంటనున్న డబుల్ బెడ్ రూం ఇళ్ల ప్రారంభోత్సవ సంబరాలు