
ఖమ్మం, ఏప్రిల్ 15: తెలిసీ తెలియని చిన్న వయసులో.. కుటుంబ సభ్యులు తిట్టారని మనసులో పెట్టుకొని.. ఉన్నపళంగా చదువు మానేసి..ఎవరికి చెప్పకుండా..ఇంటి నుంచి,హాస్టల్ నుంచి వెళ్ళిపోయాడు.. ఆ యువకుడు. ఫేస్ బుక్లో కుటుంబ సభ్యులు చూసి మనసు మార్చుకొని 25 సంవత్సరాల తర్వాత తిరిగి తన కుటుంబ సభ్యులను చూసేందుకూ వచ్చాడు. ఖమ్మం జిల్లా మధిర మండలం ఖమ్మంపాడు ముస్లిం బజారుకు చెందిన షేక్ అక్బర్ అనే యువకుడు తన కుటుంబం వద్దకు చేరడంతో వారు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. 2001 అక్బర్ తన 13 సంవత్సరాల వయసులో ఎర్రిపాలెం మండలం బనిగండ్లపాడు హాస్టల్లో ఉండి చదువుకునేవాడు. ఇంట్లో కుటుంబ సభ్యులతో చిన్న మనస్పర్ధలు కారణంగా అలిగి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు.
కుటుంబ సభ్యులు ఎంత వెతికినా అతని ఆచూకీ లభించలేదు. దాదాపుగా ఆశలు వదులుకున్నారు. అప్పటినుంచి కుటుంబ సభ్యులు అతన్ని తలుచుకుంటూ కుంగుబాటుకు గురయ్యారు. అయితే అక్బర్ ట్రైన్ లో ముంబాయి పూణే వెళ్లిపోయి.. ఆ పరిసర ప్రాంతాల్లో జీవించాడు. అక్కడే స్థిరపడి పెళ్లి కూడా చేసుకున్నాడు. ప్రస్తుతం అతనికి నలుగురు పిల్లలు. అయితే తన మొబైల్లో ఇటీవల ఫేస్బుక్లో తన కుటుంబ సభ్యులు చూసి వారిని కలవాలని అనుకున్నాడు. వెంటనే పూణే నుంచి బయలుదేరి.. నిన్న మంగళవారం తన స్వగ్రామమైన ఖమ్మంపాడు చేరుకొని కుటుంబ సభ్యుల్ని కలుసుకున్నాడు. తన కుమారుడు తిరిగి రావడంతో తండ్రి అతని సోదరులు, కుటుంబ సభ్యులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ మధ్యకాలంలోనే తన తల్లి మృతి చెందిన విషయం తెలుసుకుని తీవ్ర విచారం వ్యక్తం చేశాడు. ఎప్పటికైనా కుటుంబ బంధాలు గొప్పవనీ.. ఈ ఘటన నిరూపిస్తోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.