
స్మార్ట్ఫోన్ మార్కెట్లో కెమెరా సామర్థ్యాలపై పోటీ మరింత ఉత్కంఠభరితంగా మారుతున్న వేళ షాయోమీ తన తదుపరి ఫ్లాగ్షిప్ మోడల్ 18 ప్రో మ్యాక్స్తో భారీ అప్గ్రేడ్ను తీసుకురావడానికి సిద్ధమవుతున్నట్లు లీకులు సూచిస్తున్నాయి. ముఖ్యంగా ఈ ఫోన్లో ఒకటి కాదు, ఏకంగా రెండు 200 మెగాపిక్సెల్ కెమెరాలను అందించే అవకాశముండటం టెక్ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారింది. అధిక రిజల్యూషన్ కెమెరాలు ఇప్పటికే సాధారణమవుతున్నప్పటికీ డ్యూయల్ 200MP సెటప్ అనేది గణనీయమైన ముందడుగు అని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఈ ఫోన్లో 22nm ప్రాసెస్పై ఆధారపడిన కొత్త 200MP ప్రధాన సెన్సార్ ఉండొచ్చని సమాచారం. ఇది అధిక నాణ్యత గల చిత్రాలను అందించడమే కాకుండా, బ్యాటరీ వినియోగాన్ని తగ్గించి, వేడి ఉత్పత్తిని నియంత్రించడంలో సహాయపడుతుంది. అదనంగా LOFIC HDR 3.0, హై ఫ్రేమ్ గెయిన్ వంటి అధునాతన ఇమేజింగ్ టెక్నాలజీలు క్లిష్టమైన కాంతి పరిస్థితుల్లో కూడా స్పష్టమైన ఫోటోలను అందించేలా రూపొందించబడ్డాయి. ఈ ఫోన్లో 200MP పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ కూడా ఉండొచ్చని సమాచారం, దీని ద్వారా జూమ్, మాక్రో ఫోటోగ్రఫీ మరింత మెరుగవుతుంది.
హార్డ్వేర్ పరంగా గ్లేర్ను తగ్గించే ప్రత్యేక కోటింగ్తో కూడిన గ్లాస్-ప్లాస్టిక్ హైబ్రిడ్ లెన్స్ను ఉపయోగించే అవకాశం ఉంది. అలాగే 1/1.3 అంగుళాలు, 1/1.12 అంగుళాల వంటి పెద్ద సెన్సార్ పరిమాణాలను కంపెనీ పరీక్షిస్తున్నట్లు సమాచారం. పెద్ద సెన్సార్లు తక్కువ కాంతిలో మెరుగైన ఫోటో నాణ్యతను అందించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇక పోటీ విషయానికి వస్తే Vivo ఇప్పటికే తన X300 అల్ట్రా మోడల్లో 200MP కెమెరా సెటప్ను ప్రవేశపెట్టడంతో, ఇతర కంపెనీలు కూడా ఇదే దిశగా అడుగులు వేస్తున్నాయి. యాపిల్, ఒప్పో వంటి సంస్థలు కూడా కెమెరా టెక్నాలజీలో పెద్ద అప్డేట్లకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి