
ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ఉపయోగిస్తున్న ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్, తమ వినియోగదారుల అనుభవాన్ని మరింత మెరుగుపరిచేందుకు నిరంతరం కొత్త ఫీచర్లను పరిచయం చేస్తోంది. ఇందులో భాగంగా డెస్క్టాప్, ల్యాప్టాప్ యూజర్ల కోసం ఒక బంపర్ అప్డేట్ను తీసుకువచ్చింది. ఇకపై యూజర్లు ఎటువంటి యాప్ ఇన్స్టాల్ చేయకుండానే, నేరుగా వెబ్ బ్రౌజర్ ద్వారానే వాట్సాప్ ఆడి, వీడియో కాల్స్ మాట్లాడుకోవచ్చు.
ఇంతకుముందు ల్యాప్టాప్ లేదా పిసి ద్వారా వాట్సాప్ కాల్స్ చేయాలంటే కచ్చితంగా ఇన్స్టాల్ చేసుకోవాల్సి వచ్చేది. కానీ, ఈ కొత్త ఫీచర్ ద్వారా గూగుల్ క్రోమ్, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ లేదా ఇతర ప్రధాన వెబ్ బ్రౌజర్లలో web.whatsapp.com ఓపెన్ చేసి నేరుగా కాల్స్ చేసుకోవచ్చు. ఎలాంటి థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్ లేదా డెస్క్టాప్ యాప్ అవసరం లేకుండానే ఈ కాలింగ్ సేవలు అందుబాటులోకి వచ్చాయి.
ముందుగా మీ పిసి లేదా ల్యాప్టాప్ బ్రౌజర్లో వాట్సాప్ వెబ్ ఓపెన్ చేసి, మొబైల్ QR కోడ్ ద్వారా లాగిన్ అవ్వండి. మీరు కాల్ చేయాలనుకుంటున్న వ్యక్తి లేదా కాంటాక్ట్ చాట్ను ఎంచుకోండి. చాట్ హెడర్లో కుడివైపు పైన కనిపిస్తున్న వాయిస్ కాల్ లేదా వీడియో కాల్ ఐకాన్పై క్లిక్ చేయాలి. మొదటిసారి ఉపయోగించేటప్పుడు బ్రౌజర్లో మైక్రోఫోన్,కెమెరా అనుమతులను ఓకే చేయాల్సి ఉంటుంది.
వాట్సాప్ మొబైల్ యాప్లో లాగే, వెబ్ బ్రౌజర్ ద్వారా చేసే ఆడియో, వీడియో కాల్స్కు కూడా పక్కా భద్రత ఉంటుంది. ఈ కాల్స్ అన్నీ ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ సాంకేతికతతో రక్షించబడతాయి. అంటే ఇలా మాట్లాడుకునే సంబంధిత వ్యక్తులు తప్ప మూడో వ్యక్తి లేదా స్వయంగా వాట్సాప్ కూడా ఈ కాల్స్ను వినడం లేదా చూడటం సాధ్యపడదు.
వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే ఉద్యోగులకు, వర్చువల్ మీటింగ్లు నిర్వహించే వారికి, కంప్యూటర్పై ఎక్కువ సమయం గడిపే వారికి ఈ కొత్త వాట్సాప్ వెబ్ కాలింగ్ ఫీచర్ ఎంతో సమయాన్ని ఆదా చేస్తుంది. మెసేజింగ్ రంగంలో తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి వాట్సాప్ తీసుకువచ్చిన ఈ అప్డేట్పై యూజర్లు తీవ్ర హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి