గతంలో ఫొటోలు తీసుకోవడం అనేది చాలా అరుదుగా జరిగేది. పెళ్లి, పుట్టిన రోజు, ఇతర శుభకార్యాల సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి ఫొటోలు దిగేవారు. లేకపోతే ఫొటో స్టూడియోకి వెళితే ఫొటో గ్రాఫర్ తీసేవాడు. అది కూడా ఏడాదికి రెండు, మూడుసార్లు మాత్రమే జరిగేది. కానీ ఇప్పుడు స్మార్ట్ ఫోన్లు వచ్చాక ఫొటోగ్రఫీ హాబీ పెరిగిపోయింది. పొద్దున్నే లేచింది మొదలు రాత్రి పడుకునే వరకూ మనకు నచ్చిన విధంగా ఫొటోలు తీసుకుంటున్నాం. చెట్లు, పుట్టలు, అడవులు, కొండలు, లోయలు, నదులు, సముద్రం, జంతువులు అన్నింటితోనూ ఫొటో షూట్లు చేసుకుంటున్నాం. ఎందుకంటే ఫొటో అనేది ఒక తీపి గుర్తు. కాలాన్ని వెనకకు తీసుకు వచ్చే శక్తి ఒక్క ఫొటోకు మాత్రమే ఉంటుంది. మన ఫోన్ లోని నాణ్యత కలిగిన కెమెరా సాయంతో అందమైన ఫొటోలు తీసినప్పటికి వాటిని వేరొకరికి పంపినప్పుడు వాటి నాణ్యత తగ్గిపోతుంది. ముఖ్యమైన ఫొటోలను బంధుమిత్రులు, స్నేహితులకు పంపడానికి సాధారణంగా వాట్సాప్ ను ఉపయోగిస్తాం. అయితే దానిద్వారా ఫొటోలను వేరొకరికి పంపినప్పుడు క్వాలిటీ తగ్గిపోతుంది. దీంతో ఎంత అందమైన ఫొటోలైనా వేరొకరి వద్దకు వెళ్లేసరికీ డల్ గా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో హై-డెఫినిషన్ (హెచ్ డీ) లో ఫొటోలు, వీడియోలను పంపడానికి వాట్సాప్ కొత్త ఫీచర్ ను ప్రవేశపెట్టింది. దీనిద్వారా నాణ్యత తగ్గకుండా వేరొకరికి షేర్ చేయవచ్చు. వాట్సాప్ తీసుకువచ్చిన ఈ కొత్త అప్ డేట్ తో వినియోగదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..