Smartphone: స్మార్ట్‌ఫోన్‌ వాడే పిల్లల్లో ఆ సమస్య అధికం.. పరిశోధనల్లో వెల్లడి

|

Apr 18, 2024 | 7:26 AM

అయితే స్మార్ట్ ఫోన్‌ అతి వినియోగం వల్ల ఎన్నో రకాల సమస్యలు తప్పవని పరిశోధకులు, నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నారు. మరీ ముఖ్యంగా చిన్నారుల్లో స్మార్ట్ ఫోన్‌ కారణంగా కంటి సమస్యలు మొదలు మానసిక సంబంధిత సమస్యల వరకు వెంటాడే అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఫిన్‌లాండ్‌కు చెందిన పరిశోధకులు నిర్వహించిన పరిశోధనల్లో...

Smartphone: స్మార్ట్‌ఫోన్‌ వాడే పిల్లల్లో ఆ సమస్య అధికం.. పరిశోధనల్లో వెల్లడి
Kids Smartphone
Follow us on

చేతిలో స్మార్ట్‌ఫోన్‌ లేకపోతే రోజు గడిచే పరిస్థితి లేదు. నెలల చిన్నారి నుంచి రిటైర్‌ అయిన ఉద్యోగి వరకు ప్రతీ ఒక్కరి చేతిలో స్మార్ట్‌ ఫోన్‌ ఉండాల్సిందే. అవసరానికి కంటే ఎక్కువగా కాలక్షేపానికే ఫోన్‌ ఉపయోగించే వారి సంఖ్య పెరిగిపోయింది. అయతే ఈ కాలక్షేపం కాస్త కొందరిలో వ్యసనంగా మారుతోంది. మరీముఖ్యంగా ఇంటర్నెట్ వినియోగం పెరగడం, గేమ్స్‌, సోషల్‌ మీడియా కారణంగా చాలా మంది గంటలతరబడి ఫోన్‌లకు అతుక్కుపోతున్నారు.

అయితే స్మార్ట్ ఫోన్‌ అతి వినియోగం వల్ల ఎన్నో రకాల సమస్యలు తప్పవని పరిశోధకులు, నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నారు. మరీ ముఖ్యంగా చిన్నారుల్లో స్మార్ట్ ఫోన్‌ కారణంగా కంటి సమస్యలు మొదలు మానసిక సంబంధిత సమస్యల వరకు వెంటాడే అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఫిన్‌లాండ్‌కు చెందిన పరిశోధకులు నిర్వహించిన పరిశోధనల్లో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ఇంటర్నెట్‌, స్మార్ట్‌ ఫోన్‌ను అధికంగా ఉపయోగిస్తున్న చిన్నారులు పాఠశాలలకు గైర్హాజరయ్యే అవకాశాలు పెరుగుతున్నాయని తెలిపారు.

ముఖ్యంగా తగినంత నిద్ర, వ్యాయామం, తినడం లేకుండా గంటల తరబడి స్మార్ట్‌ ఫోన్‌లతో గడిపే చిన్నారులు స్కూళ్లకు ఎగ్గొడుతున్నారని పరిశోధనల్లో తేలింది. ఇక బాలుర కన్నా బాలికలే పరిమితికి మించి ఇంటర్నెట్‌ను వినియోగిస్తున్నారని అధ్యయనంలో వెల్లడైంది. అయితే అమ్మాయిలతో పోల్చితే అబ్బాయిలే ఎక్కువగా స్కూళ్లకు గైర్హాజరు అవుతున్నారని పరిశోధకులు చెబుతున్నారు. హెల్సింకి వర్సిటీ పరిశోధక బృందం ఇందుకోసం 14 నుంచి 16 ఏళ్ల మధ్య వయసున్న 86 వేలకు పైచిలుకు పిల్లల డేటాను విశ్లేషించి ఈ నిర్ధారణకు వచ్చారు.

ఈ వివరాలను ‘ఆర్కైవ్స్‌ ఆఫ్‌ డిసీజ్‌ ఇన్‌ చైల్డ్‌హుడ్‌’ జర్నల్‌లో ప్రచురించారు. ఎక్కువ సమయం ఇంటర్నెట్ ఉపయోగించే చిన్నారుల్లో 38 శాతం బడి ఎగ్గొట్టే ప్రమాదం ఉందని, వైద్య సంబంధిత కారణాలతో గైర్హాజరయ్యే ముప్పు 24 శాతం ఉందని అధ్యయనంలో తేలింది. అదే విధంగా బాలికల్లో 96 శాతం మంది బాలుర కన్నా అధికంగా ఇంటర్నెట్‌ వాడుతున్నారని పేర్కొంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..