ఇటీవల కాలంలో డిజిటల్ పేమెంట్స్ బాగా పెరిగాయి. కరోనా అనంతర పరిణామాల్లో ఈ డిజిటల్ పేమెంట్స్ కు బాగా ప్రాధాన్యం వచ్చింది. పేటీఎం, ఫోన్ పే, గూగుల్ పే వంటి ప్లాట్ ఫారంలు డిజిటల్ పేమెంట్స్ విషయంలో ముందంజలో ఉన్నాయి. ఆయా కంపెనీలు ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను వినియోగదారులకు అందిస్తూ తమ వ్యాపార విస్తృతిని మరింత పెంచుకుంటున్నాయి. ఈ క్రమంలో గూగుల్ పే తన యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. మరో కొత్త ఫీచర్ అందుబాటులోకి తెచ్చినట్లు ప్రకటించింది. ఎటువంటి డెబిట్ కార్డు వివరాలు లేకుండా కేవలం ఆధార్ నంబర్ సాయంతోనే యూపీఐ పేమెంట్స్ చేసుకొనే వెసులుబాటు కల్పించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
భారత్లో వయోజన జనాభాలో 99.9 శాతం మంది ఆధార్ నంబర్ను కలిగి ఉన్నారని, కనీసం నెలకు ఒకసారి దాన్ని ఉపయోగిస్తున్నారని టెక్ దిగ్గజం గూగుల్ వెల్లడించింది. అందువల్ల, యూపీఐలో ఆధార్ ఆధారిత ఆన్బోర్డింగ్ సదుపాయం విస్తృత సంఖ్యలో యూజర్లకు అందుబాటులో ఉంది.
అయితే.. ఈ ఆధార్తో యూపీఐ పేమెంట్ అవకాశం ప్రస్తుతానికి ఎంపిక చేసిన కొన్ని బ్యాంకుల కస్టమర్లకు మాత్రమే ఉంది. భారతదేశంలోని 22 బ్యాంకుల కస్టమర్లు ఆధార్ ఉపయోగించి గూగుల్ పే అథెంటికేషన్ చేసుకోవడానికి సపోర్ట్ చేస్తుంది. త్వరలో మరిన్ని బ్యాంకులు ఈ సదుపాయాన్ని తీసుకొచ్చే అవకాశం ఉంది. ఆధార్ ద్వారా యూపీఐ చెల్లింపులను వినియోగించుకోవాలంటే ఆధార్, బ్యాంక్లో నమోదు చేసుకున్న ఫోన్ నంబర్ ఒకటే అయి ఉండాలి. అలాగే బ్యాంక్ ఖాతా ఆధార్తో లింక్ చేసి ఉండాలి.
గూగుల్ పే కస్టమర్లు లావాదేవీలు చేయడం లేదా బ్యాలెన్స్ చెక్ చేసేందుకు గూగుల్ పే యాప్ని ఉపయోగించవచ్చు. గూగుల్ పే యూజర్లు ఆధార్ నంబర్లోని మొదటి 6 అంకెలను ఎంటర్ చేసిన తర్వాత వెరిఫికేషన్ కోసం ఎన్పీసీఐ ద్వారా యూఐడీఏఐకి పంపుతుంది. ఈ ప్రక్రియ యూజర్ల ఆధార్ నంబర్ భద్రతను నిర్ధారిస్తుంది. అయితే ఇక్కడ గూగుల్ పేలో ఆధార్ నంబర్ స్టోర్ చేయదని గమనించాలి. వెరిఫికేషన్ కోసం ఎన్పీసీఐతో ఆధార్ నంబర్ను షేర్ చేయడంలో కేవలం ఫెసిలిటేటర్గా పనిచేస్తుంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..