ఫేస్బుక్.. ప్రపంచంలో ఈ పేరు తెలియని వాళ్ళు ఎవరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. ఏజ్ తో సంబంధం లేకుండా ప్రతీ ఒక్కరూ ఉపయోగిస్తున్న సోషల్ మీడియా యాప్ ఇది. ఇప్పటికే వందల కోట్ల యూజర్స్ ఉన్న ఫేస్బుక్ రాబోయే 50 ఏళ్లలో ఆత్మలకు అడ్డాగా మారనుందట. రానున్న రోజుల్లో లైవ్ ప్రొఫైల్స్ కన్నా డెడ్ యూజర్ల ప్రొఫైల్స్ ఫేస్బుక్ ఎక్కువగా పెరుగుతాయని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు చెబుతున్నారు.
ఏటా 7 లక్షల మంది చనిపోతున్నారు…
ప్రపంచంలో వందల కోట్ల మందికి ఫేస్బుక్ అకౌంట్లు ఉన్నాయి. ఇక వారిలో చాలా మంది వయోభారం, ఇతరత్రా జబ్బులతోనో మరో 50 ఏళ్లలో చనిపోనున్నారట. అలా మృతి చెందిన వారి అకౌంట్లను ఎప్పటికప్పుడు డిలీట్ చేయకపోవడం వల్ల ఫేస్బుక్లో డెడ్ ప్రొఫైల్స్ ఎక్కువైపోతాయని ఆక్స్ఫర్డ్ సైంటిస్టుల మాట. ఈ లెక్కన చూస్తే 2070 నాటికి ఫేస్బుక్ ఓ వర్చువల్ స్మశానంలా మారుతుందని వారు అభిప్రాయపడుతున్నారు.
2070 నాటికి ఆత్మల అడ్డాగా ఫేస్బుక్…
2018లో ఫేస్బుక్ యూజర్ల ట్రెండ్ను పరిగణలోకి తీసుకుంటే శతాబ్దం చివరి నాటికి దక్షిణాసియాలో 44శాతం మంది యూజర్లు మృతి చెందనున్నట్లు పరిశోధన చెబుతోంది. ఇలా చూస్తే 2100 నాటికి 140 కోట్ల మంది యూజర్ల ప్రొఫైల్స్ డెడ్ కానున్నాయి. ఇక 2070 నాటికి ఫేస్బుక్లో లైవ్ ప్రొఫైల్స్ కన్నా డెడ్ యూజర్ల ప్రొఫైళ్లే ఎక్కువ ఉంటాయి. కాగా ఇప్పుడు ఫేస్బుక్ ట్రెండ్ చూస్తే ఈ దశాబ్దం చివరికి యూజర్లు 490 కోట్లకు చేరనున్నారని అంచనా.
మరోవైపు యూజర్లు మరణిస్తే వారి అకౌంట్పై ఎవరికి హక్కు ఉంటుందన్నది అందరిలో ఉన్న ప్రశ్న. నిజానికి చనిపోయిన వారి ప్రొఫైల్స్ ను ఫేస్బుక్ డిలీట్ చెయ్యదు. ఆ అకౌంట్లను మృతుల బంధువులు, స్నేహితులు కొనసాగించేలా ఫేస్బుక్ వాటిని మారుస్తుంది. ఇది కూడా కుదరకపోతే స్మారక పేజీలుగా మార్చవచ్చని ఆక్స్ఫర్డ్ సైంటిస్టులు చెబుతున్నారు.