Cancer Medicine: క్యాన్సర్ బాధితులకు గుడ్ న్యూస్.. కొత్త ఔషధం సక్సెస్.. పూర్తివివరాలివే..!

|

Jun 11, 2022 | 8:25 AM

Cancer Medicine: క్యాన్సర్ బాధితులకు ఊరటనిచ్చే వార్త ఇది. ప్రాణాంతక క్యాన్సర్‌ను అంతం చేసేందుకు మందొకటి వచ్చింది.

Cancer Medicine: క్యాన్సర్ బాధితులకు గుడ్ న్యూస్.. కొత్త ఔషధం సక్సెస్.. పూర్తివివరాలివే..!
Cancer
Follow us on

Cancer Medicine: క్యాన్సర్ బాధితులకు ఊరటనిచ్చే వార్త ఇది. ప్రాణాంతక క్యాన్సర్‌ను అంతం చేసేందుకు మందొకటి వచ్చింది. ఈ కొత్త ఔషధం క్లినికల్‌ ట్రయల్స్‌లో 18 మంది పేషెంట్లకు క్యాన్సర్‌ పూర్తిగా నయం కావడం విశేషం. అంతేకాదు వారిలో ఎలాంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ లేకపోవడం ఇంకో గుడ్‌న్యూస్‌.

ప్రపంచ వ్యాప్తంగా ఏటా లక్షల మందిని బలి తీసుకుంటున్న క్యాన్సర్‌ మహమ్మారిపై సుదీర్ఘ కాలంగా చేస్తున్న పరిశోధనలు ఇప్పటికి కొలిక్కి వస్తున్నాయ్. అత్యంత ప్రమాదకరంగా మారిన క్యాన్సర్‌పై తాజాగా ఓ ఔషధం అద్భుత ఫలితాలు చూపిస్తున్నట్లు వెల్లడైంది. క్లినికల్‌ ట్రయల్స్‌లో పాల్గొన్న వారందరిలోనూ క్యాన్సర్‌ కణాలు మాయం అయినట్టు అమెరికా శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల్లో తేలింది. క్యాన్సర్‌ బాధితులతో పాటు వైద్య రంగంలో కొత్త ఆశలు కలిగిస్తోన్న ఈ ఔషధంపై భారీ స్థాయిలో పరిశోధనలు చేపట్టాలని నిపుణులు సూచిస్తున్నారు.

క్యాన్సర్‌ బాధితులు సర్జరీలు చేయించుకున్నప్పటికీ కణాలు మాత్రం వెంటాడుతూనే ఉంటాయి. ఈ నేపథ్యంలో క్యాన్సర్‌ కణాలను నాశనం చేసే డొస్టార్లిమాబ్‌ అనే ఔషధాన్ని అమెరికా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. క్లినికల్‌ ట్రయల్స్‌లో ఇది అద్భుత ఫలితాలు వచ్చినట్టు గుర్తించారు. ప్రయోగాల్లో భాగంగా 18 మంది రోగులకు ఆరు నెలల పాటు ఔషధాన్ని ఇవ్వగా.. కోర్సు పూర్తయ్యే నాటికి ప్రతి ఒక్కరిలో క్యాన్సర్‌ కణాలు అదృశ్యమైనట్లు గుర్తించారు. ముఖ్యంగా ఎండోస్కోపీ, పెట్‌ స్కాన్‌, ఎంఆర్‌ఐ స్కానింగ్‌లోలనూ క్యాన్సర్‌ కణాల జాడ కనిపించలేదని శాస్త్రవేత్తలు కనుగొన్నారు.

సాధారణంగా క్యాన్సర్‌ రోగులకు శస్త్రచికిత్సలతోపాటు కీమోథెరపీ, రేడియేషన్‌ వంటివి ఇస్తుంటారు. చికిత్స తర్వాత బాధితుల్లో జీర్ణాశయ, మూత్ర సంబంధ సమస్యలు కనిపిస్తాయి. కానీ, కొత్త ఔషధం క్లినికల్‌ ట్రయల్స్‌లో పాల్గొన్న 18 మందిలో ఈ సమస్యలేవీ కనిపించలేవు. అంతేకాదు.. ఆరు నెలల తర్వాత ఏ ఒక్కరిలోనూ క్యాన్సర్‌ కణాలు కనిపించకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. వీటితోపాటు ఇతర అవయవాలకు వ్యాధి వ్యాపించక పోవడంతోపాటు తదుపరి చికిత్స కూడా అవసరం లేదని పరిశోధకులు చెబుతున్నారు.