భారతీ ఎయిర్టెల్.. మన దేశంలో రెండో అతి పెద్ద టెలికాం ఆపరేటర్. నెట్వర్క్ విషయంలో దీనికి ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. ఎటువంటి ప్రాంతంలో అయినా ఇది సిగ్నల్ ఇస్తుందన్న నమ్మకం వినియోగదారుల్లో ఉంటుంది. అయితే ఎయిర్టెల్ ప్లాన్ల రేటు కాస్త ఎక్కువగానే ఉంటాయి. రిలయన్స్ జియోతో పోల్చితే దీని ట్యారిఫ్ ఎక్కువే. అయితే ఇప్పుడు ఓ అద్భుతమైన ప్లాన్ను వినియోగదారులకు అందిస్తోంది. కేవలం రూ. 9తో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ని తీసుకొచ్చింది. దీనిలో ప్రత్యేకత ఏమిటంటే అపరిమితంగా డేటాను వినియోగించుకోవచ్చు. ఇది కేవలం డేటా ప్లాన్ మాత్రమే. ఎటువంటి ఇతర సేవలు లభించవు. మరి రూ.9తో రీచార్జ్ చేసుకోవడం మంచిదేనా? దాని వల్ల ప్రయోజనం ఎలా ఉంటుంది? భారతీ ఎయిర్ టెల్ రూ.9 ప్లాన్ పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
భారతీ ఎయిర్టెల్ రూ.9 ప్లాన్ అపరిమిత డేటాతో వస్తుంది. అయితే ఇది ఓ గంట సేపు మాత్రమే అందుబాటులో ఉంటుంది. అంటే గంట పాటు మీరు ఎంత డేటా వాడుకున్న ఇబ్బంది లేదు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే ఎఫ్యూపీ (ఫెయిర్ యూసేజ్ పాలసీ) పరిమితి 10జీబీ వరకూ మాత్రమే ఉంది. దీనివల్ల మీరు 10జీబీ వరకూ హై-స్పీడ్ డేటాను పొందుతారు. ఆ పరిమితి దాటిన తర్వాత ఇంటర్నెట్ వేగం 64కేబీపీఎస్కి తగ్గుతుంది. మీకు ఎక్కువ మొత్తంలో ఏదైనా డౌన్ లోడ్ చేయాల్సిన అవసరం వస్తే.. తక్కువ వ్యవధిలో ఈ డేటా బూస్ట్ మీకు అవసరం అవుతుంది. ప్రస్తుతం ఏదైనా సర్వీస్ ప్రొవైడర్ నుంచి 10జీబీ వరకు డేటా కావాలంటే అందుకు దాదాపు రూ.100 వెచ్చించాల్సి ఉంటుంది. కానీ ఈ ప్లాన్ మీకు రూ.9కే ఇస్తుంది.అయితే ఇది ఒక గంట మాత్రమే అందుబాటులో ఉంటుంది.
మీరు ఈ ప్లాన్ రెండు వోచర్లను కొనుగోలు చేస్తే, మీరు రూ. 18 ఖర్చు చేస్తారు. కానీ 20జీబీ డేటాను పొందుతారు. ఇక్కడ, ప్రతి జీబీ డేటా మీ కోసం రూ. 1 కంటే తక్కువకే వచ్చేస్తోంది. కాబట్టి కస్టమర్లకు ఇది గొప్ప అవకాశం. ఎయిర్టెల్ వెబ్సైట్తో పాటు మొబైల్ యాప్లో రీఛార్జ్ చేసుకోవడానికి ఈ ప్లాన్ ఇప్పుడు వినియోగదారులకు అందుబాటులో ఉంది. కాగా భారతీ ఎయిర్టెల్ తన పోర్ట్ఫోలియోకు ప్రీపెయిడ్ ప్లాన్ల శ్రేణిని నిశ్శబ్దంగా జోడించింది. ఇటీవల జోడించిన కొన్ని ప్లాన్లలో రూ.279 ప్లాన్, రూ.395 ప్లాన్ ఉన్నాయి.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..