
వాహనదారులకు ట్రాఫిక్ పరిస్థితులు, భద్రతా హెచ్చరికలను వేగంగా అందించేందుకు హర్యానా ప్రభుత్వం ఆధునిక వ్యవస్థను తీసుకువచ్చింది. సిటీ రద్దీని నియంత్రించడానికి, ప్రమాదాలను తగ్గించడానికి ఏఐ ఆధారిత విధానాలు రవాణా నిర్వహణను సమర్థవంతంగా మారుస్తున్నాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ నయా ట్రెండ్ విశేషాలను తెలుసుకుందాం!
టెక్నాలజీతో మమేకం కావడానికి పెద్దగా ఇష్టపడేవారు కాదు సామాన్యులు. ఇదంతా ఒకప్పటి మాట. సామాన్యులతో పాటు అన్ని ప్రభుత్వ విభాగాలలో ఏఐ వినియోగం క్రమంగా పెరుగుతోంది. తాజాగా ట్రాఫిక్లో ఏఐ వినియోగం పెరుగుతోంది. రేపో మాపో హైదరాబాద్ నగరానికి ఆ తరహా పద్దతి రాబోతోంది. హర్యానాలో మొట్టమొదటి ఏఐ-ఆధారిత స్మార్ట్ ట్రాఫిక్ హెచ్చరిక స్క్రీన్ ప్రారంభమైంది.
వాహనదారులకు ట్రాఫిక్ పరిస్థితులు, రహదారి భద్రత హెచ్చరికలు, సమాచారాన్ని వేగంగా అందించేందుకు ఆధునిక వ్యవస్థను తీసుకొచ్చింది ప్రభుత్వం. ఓ వైపు పెరుగుతున్న సిటీ రద్దీకి ట్రాఫిక్ సమస్యకు సాంకేతిక పరిష్కారాలు అవసరం అవుతున్నాయి. ప్రమాదాలను తగ్గించడం, ప్రయాణాన్ని సురక్షితంగా మార్చడం లక్ష్యంగా తీసుకొచ్చిన ఈ సాంకేతికత వ్యవస్థ, రవాణా వ్యవస్థలో కీలక పాత్ర పోషించనుంది.
మరోవైపు ఏఐ ఆధారిత విధానాలు రవాణా నిర్వహణను మరింత సమర్థవంతంగా మార్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. అదే సమయంలో కొత్త వ్యవస్థ వల్ల వాహనాలు ట్రాఫిక్ సిగ్నల్ దాటుతున్నప్పుడు వాహనాల నెంబర్ ఆధారంగా పెండింగ్ ట్రాఫిక్ చలాన్లను ప్రదర్శిస్తుంది. దీనివల్ల ఎప్పటికప్పుడు వాహనదారుడు తమ చెలాన్ల గురించి తెలుసుకోవడమే కాదు, ట్రాఫిక్ పోలీసులకు చిక్కడం ఖాయం.
సాంకేతికత ఆధారంగా పని తీరు చూపిస్తున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇప్పటివరకు గురుగ్రామ్లో ఏఐ సామర్థ్యం గల డిస్ప్లేను ఇన్స్టాల్ చేశారు. దీనిపై మీరు చలాన్లను విస్మరించలేరు అని రాసి ఉంది. మరొక దానిలో హర్యానాలో మొట్టమొదటి స్మార్ట్ ట్రాఫిక్ హెచ్చరిక స్క్రీన్ గురుగ్రామ్లో ప్రత్యక్షమైందని ఉంది.
ఈ కూడలి గుండా వెళ్లే వాహనాలను గుర్తించి పెండింగ్లో ఉన్న చలాన్లకు సంబంధించిన సమాచారాన్ని తక్షణమే ప్రదర్శిస్తుంది. ఆ ఫుటేజ్లో స్క్రీన్ ఎలా పని చేస్తుందో తెలిపే అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఆ వీడియోపై ఆన్లైన్లో వినియోగదారుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఈ చొరవను ట్రాఫిక్ ఉల్లంఘనలకు నిరోధకంగా ప్రశంసించారు. మరికొందరు ఇలాంటి సాంకేతికత పెద్ద సమస్యలను పరిష్కరిస్తుందా, అనవసరమైన ఆటంకాలను ఏమైనా సృష్టిస్తుందా అని ప్రశ్నిస్తున్నారు. ఆ తరహా పద్దతిని మిగతా రాష్ట్రాలు ఫాలో కావాలని ఆలోచన చేస్తున్నాయి.
దేశంలోని ప్రధాన నగరాలలో పెరుగుతున్న వాహనాల రద్దీని అరికట్టడానికి ట్రాఫిక్ శాఖ అధికారులు నిత్యం కొత్త పద్ధతులను అన్వేషిస్తున్నారు. మానవ తప్పిదాలను తగ్గించడానికి, నిబంధనలను కఠినంగా అమలు చేయడానికి కృత్రిమ మేధ విధానాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. మునుముందు దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన రహదారులపై ఇలాంటి స్మార్ట్ స్క్రీన్లను ఏర్పాటు చేసే అవకాశం ఉంది. డిజిటల్ టెక్నాలజీతో అనుసంధానమైన ఈ రవాణా మార్పులు రోడ్డు భద్రతను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయని నిపుణులు విశ్వసిస్తున్నారు.