IND vs AFG : భారత్‌తో టెస్ట్ మ్యాచ్‌కు ముందు ఆఫ్ఘనిస్తాన్‌కు బిగ్ షాక్.. స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ అవుట్

IND vs AFG : ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్టుకు భారత్‌తో జూన్ 6న ముల్లాన్‌పూర్‌లో ప్రారంభం కానున్న ఏకైక టెస్ట్ మ్యాచ్‌కు ముందే పెద్ద షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ లెగ్ స్పిన్నర్, మ్యాచ్ విన్నర్ రషీద్ ఖాన్ ఈ మ్యాచ్‌కు అందుబాటులో ఉండటం లేదు.

IND vs AFG : భారత్‌తో టెస్ట్ మ్యాచ్‌కు ముందు ఆఫ్ఘనిస్తాన్‌కు బిగ్ షాక్.. స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ అవుట్
Rashid Khan

Updated on: Jun 05, 2026 | 6:29 PM

IND vs AFG : ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్టుకు భారత్‌తో జూన్ 6న ముల్లాన్‌పూర్‌లో ప్రారంభం కానున్న ఏకైక టెస్ట్ మ్యాచ్‌కు ముందే పెద్ద షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ లెగ్ స్పిన్నర్, మ్యాచ్ విన్నర్ రషీద్ ఖాన్ ఈ మ్యాచ్‌కు అందుబాటులో ఉండటం లేదు. గత కొంతకాలంగా అతన్ని వేధిస్తున్న వెన్నునొప్పి మళ్లీ తిరగబెట్టడంతో అతను ఈ మ్యాచ్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. రషీద్ లేకపోవడం ఆఫ్ఘన్ జట్టు బౌలింగ్ విభాగాన్ని తీవ్రంగా దెబ్బతీసే అంశమే అని చెప్పాలి. ఈ ఏడాది ఏప్రిల్‌లోనే రషీద్ ఖాన్ టెస్ట్ క్రికెట్ భవిష్యత్తుపై ఒక కీలకమైన హింట్ ఇచ్చాడు. వెన్నునొప్పి కారణంగా తాను సుదీర్ఘమైన స్పెల్స్ వేయలేకపోతున్నానని, అందుకే రెడ్ బాల్ క్రికెట్‌కు దూరం అవ్వాలని ఆలోచిస్తున్నట్లు పేర్కొన్నాడు. ‘నువ్వు ఇంకా చాలా కాలం పాటు క్రికెట్ ఆడాలనుకుంటే, ముందు ఈ రెడ్ బాల్ క్రికెట్ ఆడటం ఆపేయ్.. ఎందుకంటే నీ వెన్నుముక దీనికి సహకరించడం లేదు’ అని డాక్టర్లు తనకు ఖచ్చితమైన సలహా ఇచ్చారని రషీద్ గతంలోనే ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.

భారత్‌తో జరిగే టెస్ట్ మ్యాచ్‌కు ముందు జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఆఫ్ఘనిస్తాన్ హెడ్ కోచ్ రిచర్డ్ పైబస్ రషీద్ ఖాన్ ఫిట్‌నెస్, భవిష్యత్తు గురించి మాట్లాడారు. రషీద్ చాలా కాలంగా వెన్నునొప్పితో బాధపడుతున్నాడని, అతను నిరంతరాయంగా క్రికెట్ ఆడుతున్నందున తన శరీరాన్ని తనే జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అయితే, తాను స్వయంగా రషీద్‌తో మాట్లాడతానని, ఆఫ్ఘనిస్తాన్ తరఫున అతను వీలైనంత ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఆడేలా చూస్తూనే, టెస్ట్ క్రికెట్‌ను కూడా ఎలా కొనసాగించవచ్చనే దానిపై చర్చిస్తానని కోచ్ నమ్మకం వ్యక్తం చేశారు.

రషీద్ ఖాన్ గైర్హాజరీలో ఆఫ్ఘనిస్తాన్ జట్టును హష్మతుల్లా షాహిదీ నడిపించనున్నాడు. ఈ జట్టులో రహ్మానుల్లా గుర్బాజ్, అజ్మతుల్లా ఒమర్జాయ్, రహ్మత్ షా వంటి కీలక ఆటగాళ్లు ఉన్నారు. ముల్లాన్‌పూర్‌లోని ఎండ తీవ్రతను తట్టుకుంటూ, యువ సంచలనం శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీలోని బలీయమైన టీమిండియాను ఎదుర్కోవడానికి ఆఫ్ఘన్ కుర్రాళ్లు రెడీ అవుతున్నారు. ఈ మ్యాచ్‌లో గిల్ నేతృత్వంలోని భారత జట్టును ఢీకొట్టడం ఆఫ్ఘనిస్తాన్‌కు పెద్ద సవాలుతో కూడుకున్న విషయమే.

ఆఫ్ఘనిస్తాన్ జట్టు గతేడాది అక్టోబర్‌లో జింబాబ్వేతో తన చివరి టెస్ట్ మ్యాచ్ ఆడింది. ఆ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. కేవలం ఒక ఇన్నింగ్స్ మరియు 73 పరుగుల తేడాతో జింబాబ్వే చేతిలో ఓడిపోయింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘన్ 127 పరుగులకే ఆలౌట్ కాగా, జింబాబ్వే 359 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో కూడా ఆఫ్ఘనిస్తాన్ 159 పరుగులకే చేతులెత్తేసింది. 2018 లో టెస్ట్ హోదా సాధించినప్పటి నుంచి ఆఫ్ఘనిస్తాన్ కేవలం 12 టెస్టులు మాత్రమే ఆడింది. అందులో 4 విజయాలు, 7 ఓటములు, ఒక డ్రా ఉన్నాయి. భారత్‌తో వీరు కేవలం ఒకే ఒక్క టెస్ట్ మ్యాచ్ ఆడటం గమనార్హం.

 

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us