
Asian Youth Games 2025: బహ్రెయిన్లో జరుగుతున్న 3వ ఏషియన్ యూత్ గేమ్స్ 2025లో భారత కబడ్డీ యువజట్టు (U-18) తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. ముఖ్యంగా, దాయాది దేశం పాకిస్థాన్తో జరిగిన లీగ్ మ్యాచ్లో 81-26 అనే భారీ తేడాతో భారత్ సంచలన విజయాన్ని నమోదు చేసింది.
అయితే, ఈ మ్యాచ్లో ఆటతీరుతో పాటు, మ్యాచ్కు ముందు జరిగిన ఒక సంఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
భారత జట్టు విజయం ఒకవైపు ఉంటే, మ్యాచ్ ప్రారంభానికి ముందు జరిగిన టాస్ సమయంలో భారత U-18 కబడ్డీ జట్టు కెప్టెన్ ఇషాంత్ రథీ తీసుకున్న నిర్ణయం అందరి దృష్టిని ఆకర్షించింది.
టాస్ సమయంలో పాకిస్థాన్ కెప్టెన్ కరచాలనం (హ్యాండ్షేక్) ఇవ్వడానికి చేయి చాచాడు. దీనికి ప్రతిస్పందనగా, భారత కెప్టెన్ ఇషాంత్ రథీ ఆ కరచాలనాన్ని సున్నితంగా తిరస్కరించాడు. అతని ముఖంలో ఎటువంటి భావం లేకుండా నిర్లిప్తత కనిపించింది. దీంతో పాకిస్థాన్ కెప్టెన్ తన చేతిని వెనక్కి తీసుకున్నాడు.
ఇటీవలి కాలంలో భారత్, పాకిస్థాన్ల మధ్య క్రీడారంగంలో పెరుగుతున్న ‘నో-హ్యాండ్షేక్’ (No-Handshake) విధానాన్ని ఈ సంఘటన మరోసారి ధృవీకరించింది. ఇది కేవలం క్రీడా పోటీ మాత్రమే కాదని, దేశాల మధ్య ఉద్రిక్తతలను ప్రతిబింబించే నిశ్శబ్ద నిరసనగా క్రీడాభిమానులు భావిస్తున్నారు.
ఏషియన్ యూత్ గేమ్స్లో కబడ్డీని ప్రవేశపెట్టడం ఇదే మొదటిసారి. ఈ టోర్నమెంట్లో భారత U-18 జట్టు అద్భుతమైన ప్రదర్శనతో దూసుకుపోతోంది. ఈ క్రమంలో బంగ్లాదేశ్పై 83 – 19తో విజయం సాధించగా, శ్రీలంకపై 89 – 16తో, పాకిస్థాన్పై 81 – 26తో వరుస విజయాలు నమోదు చేసింది.
పాకిస్థాన్పై సాధించిన ఘన విజయంతో భారత్ టోర్నమెంట్లో వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతున్న భారత జట్టు, ఫైనల్కు అర్హత సాధించింది. ఫైనల్ మ్యాచ్ అక్టోబర్ 23న జరగనుంది. భారత్ ఫైనల్లో ఇరాన్తో తలపడే అవకాశం ఉంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..