
IPL 2026 : ఐపీఎల్ 2026 (IPL 2026) సందడి మొదలైపోయింది. క్రికెట్ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 19వ సీజన్ సమరం ఈ రోజే (మార్చి 28) అట్టహాసంగా ప్రారంభం కానుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీ, సన్రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య తొలి పోరు జరగనుంది. మే 31న ఫైనల్ మ్యాచ్తో ఈ టోర్నీ ముగియనుంది. ఈసారి ఐపీఎల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ మార్పులు, కొత్త రూల్స్, షాకింగ్ ట్రేడింగ్లు చోటుచేసుకున్నాయి.
కొత్త వేదికలు.. హోమ్ గ్రౌండ్ మ్యాజిక్
ఈ సీజన్లో జట్లు తమ సొంత గడ్డపై ఆడే మ్యాచుల విషయంలో కొత్త నిర్ణయాలు తీసుకున్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీ తన హోమ్ మ్యాచులలో రెండింటిని రాయ్పూర్లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ స్టేడియంలో ఆడనుంది. పంజాబ్ కింగ్స్ నాలుగు మ్యాచులు కొత్త చండీగఢ్లో, మూడు మ్యాచులు ధర్మశాలలో ఆడుతుంది. రాజస్థాన్ రాయల్స్ కూడా జైపూర్ (4), గౌహతి (3) వేదికలను పంచుకోనుంది.
గ్రూప్ వివరాలు, మ్యాచ్ టైమింగ్స్
మొత్తం 10 జట్లను రెండు గ్రూపులుగా విభజించారు.
గ్రూప్-ఏ: సీఎస్కే, కేకేఆర్, రాజస్థాన్, ఆర్సీబీ, పంజాబ్.
గ్రూప్-బి: ముంబై, ఎస్ఆర్హెచ్, గుజరాత్, ఢిల్లీ, లక్నో.
ప్రతి జట్టు తన గ్రూప్లోని జట్లతో ఒకసారి, వేరే గ్రూప్లోని జట్లతో రెండుసార్లు ఆడుతుంది. మధ్యాహ్నం మ్యాచులు 3:30 గంటలకు, రాత్రి మ్యాచులు 7:30 గంటలకు ప్రారంభమవుతాయి.
సంచలన ట్రేడింగ్లు.. మారిన జాతకాలు
ఈసారి వేలానికి ముందే పెద్ద పెద్ద ప్లేయర్లు జట్లు మారారు. ముఖ్యంగా సంజూ శాంసన్ రాజస్థాన్ వదిలి చెన్నైకి వెళ్లగా, రవీంద్ర జడేజా రాజస్థాన్కు వచ్చాడు. మొహమ్మద్ షమీ హైదరాబాద్ నుంచి లక్నోకు, నితీష్ రాణా ఢిల్లీకి, అర్జున్ టెండూల్కర్ లక్నోకు చేరారు. వేలంలో కేకేఆర్ క్యామరూన్ గ్రీన్ ను రూ. 25.2 కోట్లకు కొని రికార్డు సృష్టించింది. సీఎస్కే అన్-క్యాప్డ్ ప్లేయర్లు ప్రశాంత్ వీర్, కార్తీక్ శర్మల కోసం ఏకంగా రూ. 14.2 కోట్లు వెచ్చించడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
గాయాల బెడద.. దూరం కానున్న స్టార్లు
టోర్నీ ప్రారంభానికి ముందే గాయాలు జట్లను వేధిస్తున్నాయి. ఎస్ఆర్హెచ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తొలి సగం మ్యాచులకు దూరం కావడంతో ఇషాన్ కిషన్ కెప్టెన్సీ చేపట్టాడు. ఆర్సీబీ పేసర్ హేజిల్వుడ్, పంజాబ్ బౌలర్ లాకీ ఫెర్గూసన్ కూడా ఆరంభ మ్యాచుల్లో ఆడటం లేదు. ఇక గ్లెన్ మాక్స్వెల్, ఫాఫ్ డుప్లెసిస్, మొయిన్ అలీ వంటి స్టార్లు ఈసారి వేలంలో పాల్గొనకుండా పాకిస్థాన్ సూపర్ లీగ్ ఆడుతున్నారు. ఆండ్రీ రస్సెల్ ఐపీఎల్ కి రిటైర్మెంట్ ప్రకటించి కేకేఆర్ కోచింగ్ స్టాఫ్ లో చేరిపోయాడు.
బీసీసీఐ కొత్త నిబంధనలు :
1. ఈసారి బీసీసీఐ క్రమశిక్షణ విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తోంది:
2. మ్యాచ్ రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాక్టీస్ సెషన్లకు అనుమతి లేదు.
3. ఏ జట్టు అయినా గరిష్టంగా రెండు ప్రాక్టీస్ మ్యాచులు మాత్రమే ఆడాలి.
4. ప్రాక్టీస్ నెట్స్ షేర్ చేసుకోకూడదు, ప్రతి జట్టుకు కొత్త నెట్స్ కేటాయిస్తారు.
5. మ్యాచ్ పిచ్పై నాలుగు రోజుల ముందే ప్రాక్టీస్ చేయడం నిషిద్ధం.
6. ప్రయాణాల సమయంలో ఆటగాళ్లతో పాటు కుటుంబ సభ్యులకు అనుమతి లేదు.
7. డ్రెస్సింగ్ రూమ్ లేదా డగౌట్ దగ్గర ఉన్న ఎల్ఈడీ బోర్డుల వద్ద ఆటగాళ్లు కూర్చోకూడదు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..