
Commonwealth Games 2026 India medals: స్కాట్లాండ్లోని గ్లాస్గో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్-2026లో భారత బాక్సర్లు అదరగొడుతున్నారు. తమ పంచులతో ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తూ ఏకంగా 10 పతకాలను ఖాయం చేసుకుని చరిత్ర సృష్టించారు. 1934లో తొలిసారి కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొన్నప్పటి నుంచి బాక్సింగ్లో భారత్ ఇన్ని పతకాలు నెగ్గడం ఇదే తొలిసారి కావడం విశేషం.
కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత క్రీడాకారులు అద్భుతమైన ప్రదర్శన చేస్తున్నారు. ఇప్పటికే భారత్ 22 పతకాలను ఖాయం చేసుకోగా, అందులో 10 పతకాలు బాక్సింగ్ విభాగం నుంచే రావడం విశేషం. ఏకంగా పది మంది భారతీయ బాక్సర్లు సెమీఫైనల్స్కు చేరుకున్నారు. బాక్సింగ్ నిబంధనల ప్రకారం సెమీస్ చేరిన ప్రతి అథ్లెట్కు కనీసం కాంస్య పతకం వస్తుంది. కాబట్టి 10 మందికి కాంస్యాలు ఖాయం అయ్యాయి. గతంలో 2018 గోల్డ్ కోస్ట్ గేమ్స్లో 9 పతకాలు సాధించడమే ఇప్పటివరకు అత్యుత్తమ ప్రదర్శన. 2022 బర్మింగ్హామ్లో 7 పతకాలు దక్కాయి. ఇప్పుడు ఆ రికార్డులన్నీ బద్దలు కొడుతూ 10 పతకాలతో భారత బాక్సర్లు కొత్త చరిత్ర లిఖించారు.
ఇదికూడా చదవండి: తొలుత 175 పరుగులు, ఆ తర్వాత 9 వికెట్లు.. లంకను దహనం చేసిన టీమిండియా తోపు
ముందుగా లవ్లీనా బోర్గోహైన్ (75 కేజీలు) బై (bye) ద్వారా నేరుగా సెమీస్కు అర్హత సాధించి భారత్కు తొలి పతకాన్ని ఖాయం చేసింది. ఆ తర్వాత 54 కేజీల విభాగంలో ప్రీతి పవార్ నార్తర్న్ ఐర్లాండ్కు చెందిన ప్రత్యర్థిని తన కళ్లు చెదిరే పంచులతో మట్టికరిపించి రెండో పతకం ఖాయం చేసింది. 60 కేజీల విభాగంలో ప్రియా ఘంఘాస్ కూడా అద్భుతంగా ఆడి సెమీస్కు చేరింది.
తాజాగా జులై 29, బుధవారం నాడు ఒక్కరోజే ఆరుగురు భారత బాక్సర్లు సెమీస్ చేరి అదుర్స్ అనిపించారు. 51 కేజీల విభాగంలో బరిలోకి దిగిన సాక్షి చౌదరి నార్తర్న్ ఐర్లాండ్కు చెందిన కైట్లిన్ ఫ్రైయర్స్పై 5-0 తేడాతో ఏకపక్ష విజయం సాధించింది. తన ఎత్తును, రీచ్ అడ్వాంటేజ్ ను పర్ఫెక్ట్గా వాడుకుంటూ ప్రత్యర్థిని దరిచేరనివ్వలేదు. 70 కేజీల విభాగంలో అరుంధతి చౌదరి.. న్యూజిలాండ్ కు చెందిన మోర్గాన్ హెండర్సన్పై 3-1 తో నెగ్గి సెమీస్ బెర్త్ దక్కించుకుంది. మరో సంచలనం జాస్మిన్ లాంబోరియా 57 కేజీల విభాగంలో ఇంగ్లాండ్ కి చెందిన ఎలీస్ గ్లిన్ను 4-1తో చిత్తు చేసి పతకాన్ని ఖాయం చేసుకుంది.
మహిళలతో పాటు పురుష బాక్సర్లు కూడా పంచ్ పవర్ చూపిస్తున్నారు. 55 కేజీల విభాగంలో జాదుమణి సింగ్ నైపుణ్యంతో కూడిన ఆట ఆడి జాంబియా బాక్సర్ను ఓడించి ముందుగానే సెమీస్ చేరాడు. ఇక 60 కేజీల విభాగంలో సచిన్ సివాచ్ 5-0 తేడాతో బోట్స్వానా బాక్సర్ను చిత్తు చేశాడు.
80 కేజీల విభాగంలో అంకుష్ పంఘాల్.. సెషెల్స్కు చెందిన జేడ్ మైకాక్ను 5-0 తో ఓడించాడు. చివరగా నరేందర్ బెర్వాల్ (+90 కేజీలు) చాలా నాటకీయంగా సాగిన పోరులో సమోవా బాక్సర్పై 3-2 తో ఉత్కంఠ విజయం సాధించి 10వ పతకాన్ని ఖాయం చేశాడు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..