Abhishek Sharma : 12 బంతుల్లో 50 కొట్టలేవా తమ్ముడూ? అభిషేక్ శర్మను ఆడుకున్న యువరాజ్ సింగ్

Abhishek Sharma : టీమిండియా యంగ్ సెన్సేషన్ అభిషేక్ శర్మ తన బ్యాట్‌తో బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20లో అభిషేక్ ఆడిన ఇన్నింగ్స్ చూస్తే ప్రత్యర్థుల వెన్నులో వణుకు పుట్టాల్సిందే. కేవలం 14 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాది అందరినీ ఆశ్చర్యపరిచాడు.

Abhishek Sharma : 12 బంతుల్లో 50 కొట్టలేవా తమ్ముడూ? అభిషేక్ శర్మను ఆడుకున్న యువరాజ్ సింగ్
Abhishek Sharma Yuvraj Singh

Updated on: Jan 26, 2026 | 6:56 AM

Abhishek Sharma : టీమిండియా యంగ్ సెన్సేషన్ అభిషేక్ శర్మ తన బ్యాట్‌తో బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20లో అభిషేక్ ఆడిన ఇన్నింగ్స్ చూస్తే ప్రత్యర్థుల వెన్నులో వణుకు పుట్టాల్సిందే. కేవలం 14 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాది అందరినీ ఆశ్చర్యపరిచాడు. అయితే తన గురువు యువరాజ్ సింగ్ రికార్డును మాత్రం అభిషేక్ టచ్ చేయలేకపోయాడు. దీనిపై యువీ సోషల్ మీడియాలో తన శిష్యుడి పై వేసిన సెటైర్లు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

గౌహతి వేదికగా జనవరి 25న జరిగిన టీ20 మ్యాచ్‌లో అభిషేక్ శర్మ ఆడిన ఇన్నింగ్స్ క్రికెట్ చరిత్రలో నిలిచిపోతుంది. టీ20 వరల్డ్ కప్ 2026కు టీమిండియా ఆశాకిరణంగా మారుతున్న ఈ యువ ఓపెనర్, న్యూజిలాండ్ బౌలర్లను ఉతికి ఆరేశాడు. పవర్ ప్లే ఆఖరి బంతికి సిక్సర్ బాదడం ద్వారా కేవలం 14 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో భారత తరపున టీ20ల్లో రెండో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన ప్లేయర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు. అయితే, తన మెంటార్ యువరాజ్ సింగ్ 2007లో ఇంగ్లాండ్‌పై సృష్టించిన 12 బంతుల ప్రపంచ రికార్డును మాత్రం అధిగమించలేకపోయాడు.

అభిషేక్ ఇన్నింగ్స్ ముగిసిన వెంటనే యువరాజ్ సింగ్ సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. సరదాగా తన శిష్యుడిని ఏడిపిస్తూ.. “నువ్వు ఇప్పటికీ 12 బంతుల్లో 50 కొట్టలేవు కదా?” అంటూ వెటకారం చేశాడు. అయితే ఆ వెంటనే, “చాలా బాగా ఆడావు.. ఇదే జోరును కొనసాగించు” అంటూ విషెష్ కూడా తెలిపాడు. గురుశిష్యుల మధ్య జరిగిన ఈ సంభాషణ నెటిజన్లను ఎంతగానో అలరిస్తోంది. అభిషేక్ కెరీర్ ప్రారంభం నుంచి యువరాజ్ సింగ్ అతనికి మార్గదర్శిగా ఉంటూ, అతనిలోని టాలెంటును వెలికితీస్తున్న సంగతి తెలిసిందే.

ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు నిర్ణీత ఓవర్లలో 153 పరుగులు చేసింది. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా తన అద్భుతమైన బౌలింగ్‌తో 3 వికెట్లు పడగొట్టగా, రవి బిష్ణోయ్ 2 వికెట్లు తీశాడు. 154 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్, తొలి బంతికే సంజూ శాంసన్ వికెట్ కోల్పోయి కష్టాల్లో పడినట్లు అనిపించింది. కానీ అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ కలిసి విధ్వంసం సృష్టించారు. అభిషేక్ 20 బంతుల్లో 68 పరుగులు (7 ఫోర్లు, 5 సిక్సర్లు) చేయగా, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 57 పరుగులతో అజేయంగా నిలిచాడు. వీరి మెరుపులతో భారత్ కేవలం 10 ఓవర్లలోనే (60 బంతులు) లక్ష్యాన్ని ఛేదించి 8 వికెట్ల తేడాతో విజయం సాధించడమే కాకుండా, సిరీస్‌ను 3-0తో కైవసం చేసుకుంది.

 

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..