
Asia Cup 2026: మహిళల ఆసియా కప్ 2026లో భారత్ వరుసగా మూడో విజయాన్ని అందుకుని గ్రూప్-ఎ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. పాకిస్థాన్ను 7 వికెట్ల తేడాతో ఘోరంగా చిత్తు చేసిన హర్మన్ప్రీత్ సేన గంభీరంగా సెమీఫైనల్ బెర్తును ఖరారు చేసుకోగా, ప్రత్యర్థి పాకిస్థాన్ తీవ్ర టెన్షన్లో పడిపోయింది. దుబాయ్ వేదికగా శనివారం జరిగిన గ్రూప్ దశ చివరి మ్యాచ్లో పాకిస్థాన్ను భారత క్రీడాకారిణులు పూర్తిగా నీరుగార్చారు. థాయిలాండ్ (65 పరుగులు), హాంకాంగ్ (56 పరుగులు) ఇచ్చిన పోటీని కూడా ఇవ్వలేకపోయిన పాక్ జట్టు కేవలం 55 పరుగులకే కుప్పకూలింది. ఈ స్వల్ప లక్ష్యాన్ని భారత్ కేవలం 8.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఊదేసింది. గ్రూప్ దశలో ఆడిన మూడింటికి మూడు మ్యాచ్లు గెలిచిన టీమిండియా 6 పాయింట్లు, +5.471 అద్భుతమైన నెట్ రన్రేట్తో గ్రూప్-ఎలో తిరుగులేని నంబర్-1 స్థానంలో నిలిచి సెమీస్లో అడుగుపెట్టింది.
పాకిస్థాన్కు ముంచుకొస్తున్న గండం
భారత్ చేతిలో ఘోర పరాభవం ఎదురవ్వడంతో పాకిస్థాన్ సెమీస్ అర్హత అవకాశాలు సందిగ్ధంలో పడ్డాయి. ప్రస్తుతం పాయింట్ల పట్టికను పరిశీలిస్తే.. ఆడిన 2 మ్యాచ్ల్లో ఒక గెలుపు, ఒక ఓటమితో పాకిస్థాన్ 2 పాయింట్లు, -0.569 నెట్ రన్రేట్తో రెండో స్థానంలో ఉంది. మూడో స్థానంలో ఉన్న థాయిలాండ్ ఆడిన 3 మ్యాచ్లలో ఒక విజయం సాధించి 2 పాయింట్లు, -2.050 నెట్ రన్రేట్ కలిగి ఉంది. ఇక చివరి స్థానంలో ఉన్న హాంకాంగ్ ఆడిన 2 మ్యాచ్ల్లోనూ ఓడిపోయి సున్నా పాయింట్లు, -3.575 నెట్ రన్రేట్తో పట్టిక అడుగున ఉంది. పాకిస్థాన్ తన తదుపరి మ్యాచ్లో హాంకాంగ్పై తప్పక గెలవాల్సి ఉంది. ఒకవేళ ఏమైనా అద్భుతం జరిగి హాంకాంగ్ చేతిలో పాక్ ఓడిపోతే, సెమీస్ రేసు నెట్ రన్రేట్పై ఆధారపడి ఉత్కంఠగా మారనుంది.
గ్రూప్-బిలో లంక ఆధిపత్యం
మరోవైపు గ్రూప్-బి పాయింట్ల పట్టిక పరిణామాలను గమనిస్తే.. శ్రీలంక ప్రస్తుతం ఆధిపత్యం చెలాయిస్తోంది. ఆడిన 2 మ్యాచ్ల్లోనూ విజయాలు సాధించి 4 పాయింట్లు, +4.129 నెట్ రన్రేట్తో లంక జట్టు మొదటి స్థానంలో కొనసాగుతోంది. బంగ్లాదేశ్ ఆడిన ఒకే ఒక్క మ్యాచ్లో విజయం సాధించి 2 పాయింట్లు, +3.550 నెట్ రన్రేట్తో రెండో స్థానంలో నిలిచింది. ఆతిథ్య యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఏఈ) ఆడిన 2 మ్యాచ్ల్లో ఒక గెలుపుతో 2 పాయింట్లు, -0.854 నెట్ రన్రేట్తో మూడో స్థానంలో ఉండగా, ఇండోనేషియా ఆడిన 3 మ్యాచ్లలోనూ ఓటమి పాలై ఎటువంటి పాయింట్లు లేకుండా -3.169 నెట్ రన్రేట్తో ఆఖరి స్థానంలో ఉంది.
నేడు శ్రీలంక-బంగ్లాదేశ్ మధ్య పోరు
ఆసియా కప్ టోర్నీలో ఆదివారం గ్రూప్-బిలో అత్యంత కీలకమైన మ్యాచ్ శ్రీలంక, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరగనుంది. ఈ మ్యాచ్లో శ్రీలంక గెలిస్తే భారత్ తరహాలోనే హ్యాట్రిక్ విజయాలతో నేరుగా సెమీఫైనల్ బెర్తును దక్కించుకుంటుంది. ఒకవేళ బంగ్లాదేశ్ గనుక శ్రీలంకకు షాక్ ఇస్తే, ఆ గ్రూప్ నుంచి సెమీస్ చేరే జట్ల వివరాల కోసం తదుపరి యుఏఈ మ్యాచ్ ఫలితం వరకు ఉత్కంఠగా నిరీక్షించక తప్పదు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..