
ఏప్రిల్ 30, బుధవారం రోజున భారత క్రికెట్ దిగ్గజం రోహిత్ శర్మ తన 38వ పుట్టినరోజును ఘనంగా జరుపుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు సోషల్ మీడియా వేదికగా తమ అభిమానాన్ని వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు వెల్లువెత్తించారు. ఈ సందర్భంగా రోహిత్ శర్మకు సంబంధించిన అనేక ఇంటర్వ్యూలు మీడియా వేదికలపై చక్కర్లు కొట్టగా, ఒక ముఖ్యమైన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇందులో రోహిత్ తన తల్లిదండ్రులు ఎప్పుడూ స్టేడియానికి ఎందుకు రారు అన్న అంశంపై స్పందించాడు. సాధారణంగా రోహిత్ భార్య రితికా సజ్దే, కూతురు స్టేడియంలో కనిపిస్తుంటారు కానీ ఆయన తల్లిదండ్రులు కనిపించరని అభిమానులు గమనించేవారు.
దీనిపై స్పందించిన రోహిత్, తన తల్లిదండ్రులు స్టేడియంలోకి వచ్చినప్పుడు చాలా ఒత్తిడికి గురవుతారని, అందుకే వారు ఇంటి నుంచే మ్యాచ్లను చూడటాన్ని ఇష్టపడతారని తెలిపారు. వారు ఎక్కువగా ఇంటిని వదిలి బయటకు వెళ్లే వారు కాదని పేర్కొన్నారు. జర్నలిస్ట్ విమల్ కుమార్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని బహిర్గతం చేశారు. అయితే వాంఖడే స్టేడియంలో తన పేరు మీదుగా స్టాండ్ ప్రారంభోత్సవం జరిగినప్పుడు మాత్రం, వారు తప్పకుండా రావాలని తాను ఆహ్వానించానని రోహిత్ తెలిపాడు. “వారు నా పేరుతో ఉన్న స్టాండ్ ప్రారంభానికి రావాలని నేను చెప్పాను,” అని పేర్కొన్నాడు.
మరోవైపు, ముంబై క్రికెట్ అసోసియేషన్ రోహిత్ శర్మకు ఘనంగా గౌరవం లభించేలా వాంఖడే స్టేడియంలో ఉన్న దివేచా పెవిలియన్ లెవెల్ 3 స్టాండ్ను ‘రోహిత్ శర్మ స్టాండ్’గా పెట్టనున్నారు. ఈ విషయాన్ని గురించి మాట్లాడుతూ రోహిత్ భావోద్వేగంగా స్పందించాడు. “ఈ మైదానం నాకు అన్నిటికంటే ఎక్కువ. చిన్నపుడు దానిలోకి కూడా వెళ్లే అవకాశం లేదు. ఇప్పుడు నా పేరు మీద స్టాండ్ ఉండటం అనేది చాలా గొప్ప విషయం. ఇక్కడే నేను పెరిగాను, ప్రాక్టీస్ చేశాను, కష్టపడ్డాను, తిట్లు కూడా తిన్నాను,” అని చెప్పారు. తన క్రికెట్ ప్రయాణం వాంఖడే స్టేడియంతో అల్లుకున్న అనుబంధాన్ని స్పష్టంగా చెప్పేలా ఈ వ్యాఖ్యలు ఉన్నాయి. ప్రస్తుతం రోహిత్ ముంబై ఇండియన్స్ జట్టుతో IPL 2025లో పోటీ పడుతూ, మే 1న రాజస్థాన్ రాయల్స్తో జరగనున్న కీలక మ్యాచ్కు సిద్ధమవుతున్నాడు. తాను జన్మదిన వేడుకలు జరుపుకున్న తర్వాత తొలిసారి మైదానంలోకి దిగనున్న ఈ మ్యాచ్పై అభిమానుల్లో భారీ ఉత్సాహం నెలకొంది.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..