Vaibhav Sooryavanshi : వైభవ్ సూర్యవంశీ గొడవపై ఎట్టకేలకు నోరు విప్పిన బీసీసీఐ.. యంగ్ ప్లేయర్‌పై యాక్షన్ ఉంటుందా?

Vaibhav Sooryavanshi : శ్రీలంక ఏ జట్టుతో మ్యాచ్ అనంతరం జరిగిన గొడవలో వైభవ్ సూర్యవంశీ ప్రవర్తనపై బీసీసీఐ స్పందించింది. యువ ఆటగాడిపై ఎలాంటి క్రమశిక్షణా చర్యలు ఉండవని సెక్రటరీ దేవాజిత్ సైకియా స్పష్టం చేశారు. ఐసీసీ నిబంధనలు, వివాదం వెనుక అసలు కారణాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

Vaibhav Sooryavanshi : వైభవ్ సూర్యవంశీ గొడవపై ఎట్టకేలకు నోరు విప్పిన బీసీసీఐ.. యంగ్ ప్లేయర్‌పై యాక్షన్ ఉంటుందా?
Vaibhav Sooryavanshi

Updated on: Jun 17, 2026 | 10:00 AM

Vaibhav Sooryavanshi : శ్రీలంక వేదికగా జరుగుతున్న ట్రై సిరీస్‌లో భాగంగా సోమవారం దంబల్లాలో ఇండియా-ఎ, శ్రీలంక-ఎ జట్ల మధ్య ఒక హై-వోల్టేజ్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ టై కావడంతో ఫలితం కోసం సూపర్ ఓవర్ నిర్వహించారు. సూపర్ ఓవర్‌లో గెలవడానికి 17 పరుగులు చేయాల్సిన తరుణంలో భారత జట్టు కేవలం 9 పరుగులు మాత్రమే చేయగలిగింది. సూపర్ ఓవర్ ఆఖరి మూడు బంతులను ఎదుర్కొన్న వైభవ్ సూర్యవంశీ జట్టును గెలిపించలేకపోయాడు. దీనితో ఇండియా-ఎ జట్టు టోర్నీలో వరుసగా రెండో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. మ్యాచ్ ముగిసిన తర్వాత భారత బ్యాటర్లు వైభవ్ సూర్యవంశీ, సూర్యాంశ్ శెడ్గేలు పెవిలియన్‌కు తిరిగి వెళ్తుండగా.. శ్రీలంక ఆటగాళ్లు భారత ఆటగాళ్లను రెచ్చగొట్టేలా విపరీతంగా సంబరాలు చేసుకున్నారు. ఇది కాస్తా శృతిమించడంతో వైభవ్ వెనక్కి తిరిగి లంక ఆటగాళ్లతో వాగ్వాదానికి దిగాడు.

శ్రీలంక ప్లేయర్‌ను నెట్టేసిన వైభవ్ సూర్యవంశీ

ఈ హీటెడ్ ఆర్గ్యుమెంట్ సమయంలో కోపాన్ని అణచుకోలేకపోయిన వైభవ్ సూర్యవంశీ.. ఒక శ్రీలంక ఆటగాడిని గట్టిగా వెనక్కి నెట్టివేశాడు. దీనితో మైదానంలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వెంటనే మిగతా లంక క్రికెటర్లు, అంపైర్లు జోక్యం చేసుకుని వైభవ్‌ను పక్కకు తీసుకెళ్లారు. క్రికెట్ మైదానంలో ఇలాంటి శారీరక ఘర్షణలు తీవ్రమైన నేరంగా పరిగణించబడతాయి. ఐసీసీ నిబంధనల ప్రకారం ఆటగాళ్ల మధ్య భౌతిక దాడులు పూర్తిగా నిషేధించబడినందున.. వైభవ్ సూర్యవంశీ పై బీసీసీఐ కఠిన చర్యలు తీసుకుంటుందని, అతనికి జరిమానా లేదా నిషేధం విధిస్తారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం సాగింది.

స్పందించిన బీసీసీఐ.. యువ ప్లేయర్‌కు గ్రీన్ సిగ్నల్

ఈ అంతర్జాతీయ వివాదంపై బీసీసీఐ ఎట్టకేలకు తన మౌనాన్ని వీడింది. స్పోర్ట్‌స్టార్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో బీసీసీఐ సెక్రటరీ దేవాజిత్ సైకియా మాట్లాడుతూ.. వైభవ్ సూర్యవంశీపై ఎలాంటి క్రమశిక్షణా చర్యలు తీసుకునే ఆలోచన లేదని స్పష్టం చేశారు. “ప్రస్తుతానికి మా ఆటగాళ్లు కేవలం టోర్నమెంట్‌పై మాత్రమే దృష్టి పెట్టాలని మేము కోరుకుంటున్నాము. మైదానం వెలుపల లేదా పక్కనే జరిగే ఇలాంటి అనవసరమైన విషయాల వల్ల మా ప్లేయర్స్ ఏమాత్రం డైవర్ట్ కాకూడదు” అని సైకియా పేర్కొన్నారు. భారత కోచ్ కూడా లంక ఆటగాళ్లకు మైదానంలో ఎలా ప్రవర్తించాలో నేర్చుకోవాలంటూ గట్టి కౌంటర్ ఇచ్చారు.

ఐసీసీ రూల్ బుక్ ఏం చెబుతోంది?

ఐసీసీ కోడ్ ఆఫ్ కాండక్ట్ లోని ఆర్టికల్ 2.12 నిబంధన ప్రకారం.. అంతర్జాతీయ మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఒక ఆటగాడు తోటి ప్లేయర్, సపోర్ట్ స్టాఫ్, అంపైర్ లేదా మ్యాచ్ రెఫరీతో అనుచితమైన రీతిలో శారీరకంగా తాకడం లేదా ఘర్షణ పడటం పూర్తిగా నిషిద్ధం. ఒకవేళ ఎవరైనా ఆటగాడు కావాలని లేదా అజాగ్రత్తగా ప్రత్యర్థి ప్లేయర్‌పైకి దూసుకెళ్లినా, నెట్టినా అది రూల్స్ ఉల్లంఘన కిందకే వస్తుంది. అయితే ఈ తప్పు తీవ్రతను అంచనా వేసేటప్పుడు.. ఆ గొడవ ఏ పరిస్థితుల్లో జరిగింది? ఎవరైనా ముందుగా రెచ్చగొట్టారా? దెబ్బతిన్న వ్యక్తికి ఏమైనా గాయాలయ్యాయా? అనే విషయాలను మ్యాచ్ రెఫరీ క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఈ మ్యాచ్‌లో లంక ఆటగాళ్లే మొదట ప్రొవోక్ చేసినట్లు తేలడంతో లంక క్రికెట్ బోర్డు కూడా తమ ప్లేయర్లపై చర్యలకు దిగింది.

ఫామ్ కోసం వెతుకులాటలో వైభవ్

ఇటీవల ముగిసిన ఐపీఎల్ టోర్నమెంట్‌లో అద్భుతమైన ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించిన వైభవ్ సూర్యవంశీ.. ఈ త్రైపాక్షిక సిరీస్‌లో మాత్రం ఇంకా తన అసలైన ఫామ్‌ను అందుకోలేకపోయాడు. టోర్నీలో మంచి ఓపెనింగ్ స్టార్ట్స్ లభిస్తున్నప్పటికీ.. వాటిని పెద్ద ఇన్నింగ్స్‌లుగా మార్చడంలో వైభవ్ విఫలమవుతున్నాడు. ఈ టోర్నమెంట్‌లో అతను ఇప్పటివరకు ఆడిన మ్యాచ్‌లలో 14, 44, 21 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అయినప్పటికీ అతని టాలెంట్‌ను నమ్మిన బీసీసీఐ.. ఈ వివాదం వల్ల అతని కెరీర్‌ దెబ్బతినకుండా ఉండేందుకే అతనికి పూర్తి మద్దతుగా నిలిచింది. తదుపరి జరగబోయే అఫ్గానిస్తాన్‌తో మ్యాచ్‌లో భారత్-ఎ జట్టు విజయం సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది.

 

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us