
BCCI Under 25 Team: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రతిష్టాత్మకంగా భావించే అండర్-25 జట్టు ఎంపికలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. రాబోయే కాలంలో భారత టెస్ట్ జట్టుకు వెన్నెముకగా నిలిచే ఆటగాళ్లను గుర్తించేందుకు బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో ప్రత్యేక టోర్నమెంట్ నిర్వహించనున్నారు. ఇందుకోసం ఎంపిక చేసిన 25 మంది సభ్యుల జాబితాలో వైభవ్ సూర్యవంశీ, ఆయుష్ మ్హాత్రే పేర్లు లేకపోవడం గమనార్హం. శ్రీలంకలో జరగనున్న రెడ్ బాల్ క్రికెట్ సిరీస్ కోసం భారత అండర్-19, అండర్-25 జట్లు పయనమవనున్న తరుణంలో ఈ నిర్ణయం వెలువడింది.
ప్రస్తుత ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ ముగిసిన వెంటనే, బీసీసీఐ ఈ ప్రత్యేక నాలుగు రోజుల మ్యాచ్ల టోర్నమెంట్ను ప్రారంభించనుంది. దేశవ్యాప్తంగా ఉన్న 64 మంది అత్యుత్తమ యువ క్రికెటర్లను నాలుగు జట్లుగా విభజించి ఈ పోటీలు నిర్వహిస్తారు. ఈ ప్రతిభావంతులను ఎంపిక చేయడానికి ఒక ప్రత్యేక ప్రాతిపదికను అనుసరించారు. అందులో 25 మంది ఆటగాళ్లు సి.కె. నాయుడు ట్రోఫీ, అండర్-23 వన్డే మ్యాచ్ల నుంచి, మరో 25 మంది ఆటగాళ్లను రంజీ ట్రోఫీ, విజయ్ హజారే, సయ్యద్ ముస్తాక్ అలీ వంటి ప్రధాన టోర్నీల నుంచి ఎంపిక చేశారు. మిగిలిన 14 స్థానాలను ఐపీఎల్ ప్రదర్శన ఆధారంగా భర్తీ చేయనున్నారు.
వైభవ్ సూర్యవంశీ, ఆయుష్ మ్హాత్రే వంటి మేటి ఆటగాళ్లను ప్రాథమిక జాబితాలో చేర్చకపోవడానికి ఒక బలమైన కారణం ఉంది. వీరిద్దరూ ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్లో బిజీగా ఉన్నారు. ఆయుష్ మ్హాత్రే చెన్నై సూపర్ కింగ్స్ తరపున, వైభవ్ సూర్యవంశీ రాజస్థాన్ రాయల్స్ జట్టులో సభ్యులుగా ఉన్నారు. ఐపీఎల్ ముగిసిన తర్వాత ఎంపిక చేసే టాప్ 14 మంది ఆటగాళ్ల జాబితాలో వీరి పేర్లు ఉండే అవకాశం మెండుగా ఉందని సమాచారం. కాబట్టి అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
ప్రస్తుతం ఎంపికైన జట్టులో ఆయుష్ దోసేజా, యశ్ ధుల్, మయాంక్ వర్మ, ఆయుష్ పాండే, శాశ్వత్ రావత్, మహేష్ పిథియా, రాజ్ లింభాని, ఆర్య దేశాయ్, సిద్ధార్థ్ దేశాయ్, ఆకిబ్ ఖాన్, కార్తీక్ యాదవ్, విద్యాధర్ పాటిల్, కె. హిమతేజ, భువనగిరి పున్నయ్య, పుఖరాజ్ మాన్, యశవర్ధన్ దలాల్, పార్థ్ వత్స్, ఈడెన్ ఆపిల్ టామ్, హిమాన్షు సింగ్, అమన్ మోఖడే వంటి ఆటగాళ్లు ఉన్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..