గుడ్‌న్యూస్.. తిలక్ వర్మకు కెప్టెన్సీ బాధ్యతలు! అధికారిక ప్రకటన విడుదల

దులీప్ ట్రోఫీ 2026 కోసం సౌత్ జోన్ జట్టుకు భారత టీ20 వైస్ కెప్టెన్ తిలక్ వర్మ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఆంధ్ర క్రికెటర్ రికీ భుయ్ వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు. స్టార్ ఆటగాళ్లతో కూడిన ఈ జట్టు ఆగస్టు 30 నుంచి సెమీఫైనల్‌లో బరిలోకి దిగనుంది.

గుడ్‌న్యూస్.. తిలక్ వర్మకు కెప్టెన్సీ బాధ్యతలు! అధికారిక ప్రకటన విడుదల
Tilak Varma

Updated on: Aug 02, 2026 | 4:31 PM

భారత టీ20 జట్టు వైస్ కెప్టెన్, యువ స్టార్ బ్యాటర్ తిలక్ వర్మకు మరో కీలక బాధ్యత దక్కింది. ప్రతిష్టాత్మక దులీప్ ట్రోఫీ–2026 టోర్నీ కోసం ఎంపిక చేసిన సౌత్ జోన్ జట్టుకు తిలక్ వర్మను కెప్టెన్‌గా నియమించారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రికీ భుయ్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా, ఆంధ్రకు చెందిన అనుభవజ్ఞుడైన కోచ్ ఎం.ఎన్. విక్రమ్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు.

దులీప్ ట్రోఫీ టోర్నీ ఆగస్టు 23 నుంచి సెప్టెంబర్ 10 వరకు బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో జరగనుంది. గత ఏడాది ఫైనల్‌కు చేరుకున్న సౌత్ జోన్ జట్టు ఈసారి నేరుగా సెమీఫైనల్‌కు అర్హత సాధించింది. ఆగస్టు 30న జరిగే సెమీఫైనల్‌లో మరో క్వార్టర్ ఫైనల్ విజేతతో తలపడనుంది. ఇటీవల జింబాబ్వేతో జరిగిన టీ20 సిరీస్‌లో భారత జట్టు 3-0తో విజయం సాధించడంలో తిలక్ వర్మ కీలక పాత్ర పోషించాడు. అతని నాయకత్వ లక్షణాలు, నిలకడైన ప్రదర్శనను దృష్టిలో ఉంచుకుని సెలెక్టర్లు సౌత్ జోన్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది.

ఈ జట్టులో అనుభవజ్ఞులైన, యువ ప్రతిభ కలగలిపిన బలమైన కూర్పు కనిపిస్తోంది. భారత జట్టు తరఫున ఆడిన కరుణ్ నాయర్‌తో పాటు, గత రంజీ ట్రోఫీలో 950 పరుగులు చేసి ఆకట్టుకున్న కర్ణాటక బ్యాటర్ ఆర్. స్మరన్‌కు కూడా చోటు దక్కింది. హైదరాబాద్‌కు చెందిన కె.ఎం. హిమతేజ, భారత్ ‘ఏ’ జట్టుతో ఇటీవల శ్రీలంక పర్యటనలో రాణించిన షేక్ రషీద్, గోవాకు చెందిన అభినవ్ తేజ్రానా కూడా జట్టులో స్థానం సంపాదించారు. వికెట్ కీపర్‌గా తమిళనాడుకు చెందిన ఎన్. జగదీషన్ ఎంపికయ్యాడు. బౌలింగ్ విభాగంలో ఎడమచేతి స్పిన్నర్ తనయ్ త్యాగరాజన్, లెగ్ స్పిన్నర్ శ్రేయాస్ గోపాల్ జట్టుకు ప్రధాన బలంగా నిలవనున్నారు. ఫాస్ట్ బౌలింగ్ బాధ్యతలను కె. సాయి తేజ, త్రిపురాణ విజయ్, విద్వత్ కావేరప్ప, ఎం.డి. నిదీష్ నిర్వహించనున్నారు.

సౌత్ జోన్ జట్టును ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన సెలక్షన్ కమిటీ సమావేశంలో ఖరారు చేశారు. దేశీయ క్రికెట్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన టోర్నీల్లో ఒకటైన దులీప్ ట్రోఫీలో ఈసారి సౌత్ జోన్ టైటిల్‌పై కన్నేసింది. యువ ఆటగాళ్లు, అనుభవజ్ఞుల సమతుల్య కూర్పుతో బరిలోకి దిగుతున్న తిలక్ వర్మ సారథ్యంలోని జట్టుపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

సౌత్ జోన్ జట్టు: ఎన్ తిలక్ వర్మ (కెప్టెన్), రికీ భుయ్ (వైస్ కెప్టెన్), అభినవ్ తేజ్రానా, షేక్ రషీద్, కెఎమ్ హిమతేజ, ఆర్ స్మరన్, ఎన్ జగదీషన్ (వికె), కరుణ్ నాయర్, తనయ్ త్యాగరాజన్, శ్రేయాస్ గోపాల్, కె సాయి తేజ, టి విజయ్, విద్వాత్, టి విజయ్, విద్వాత్, ఎండి.నిదీష్.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us