
Gautam Gambhir Deepfake Video: భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ డీప్ఫేక్ బాధితుడిగా మారారు. 2026 టీ20 ప్రపంచకప్ విజయం తర్వాత గంభీర్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. తన ముఖం, గొంతు, పేరును అక్రమంగా ఉపయోగిస్తూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. తన వ్యక్తిత్వ హక్కులు కాపాడాలని కోరుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు.
2025 చివరలో గంభీర్ పేరుతో కొన్ని నకిలీ వీడియోలు ఇంటర్నెట్లో హల్చల్ చేశాయి. వాయిస్ క్లోనింగ్, ఫేస్-స్వాపింగ్ టెక్నాలజీని ఉపయోగించి సృష్టించిన ఈ వీడియోల్లో గంభీర్ ఎప్పుడూ అనని మాటలను అన్నట్లుగా చిత్రీకరించారు.
మొదటి వీడియో: తాను హెడ్ కోచ్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు గంభీర్ చెబుతున్నట్లుగా ఉంది (సుమారు 17 లక్షల వ్యూస్).
రెండవ వీడియో: టీమ్ ఇండియాలోని సీనియర్ ఆటగాళ్లపై గంభీర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నట్లుగా ఉంది (సుమారు 20 లక్షల వ్యూస్).
ఈ వీడియోలు నిజమని నమ్మిన వేలాది మంది నెటిజన్లు గంభీర్పై విమర్శలు గుప్పించడంతో ఆయన ప్రతిష్ట దెబ్బతింది.
ఈ వ్యవహారంలో గంభీర్ దాదాపు 16 కంపెనీలను ప్రతివాదులుగా చేర్చారు. ఇందులో మెటా (ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్), ఎక్స్ (ట్విట్టర్), గూగుల్ వంటి సోషల్ మీడియా దిగ్గజాలతో పాటు అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి ఈ-కామర్స్ సంస్థలు కూడా ఉన్నాయి. తన అనుమతి లేకుండా తన రూపాన్ని ఉపయోగించుకున్నందుకు, ఆ నకిలీ కంటెంట్ను తొలగించనందుకుగాను రూ. 2.5 కోట్ల హర్జామనా చెల్లించాలని ఆయన కోరారు.
ఇంటర్నెట్ నుంచి సదరు అభ్యంతరకర కంటెంట్ను తక్షణమే తొలగించాలని గంభీర్ తరపు న్యాయవాదులు కోరారు. ఏఐ టెక్నాలజీని అడ్డుపెట్టుకుని సెలబ్రిటీల వ్యక్తిగత స్వేచ్ఛకు, గౌరవానికి భంగం కలిగిస్తున్నారని వాదించారు. ప్రస్తుతం సెలబ్రిటీలు ఎదుర్కొంటున్న డీప్ఫేక్ ముప్పుపై ఈ కేసు ఒక మైలురాయిగా నిలిచే అవకాశం ఉంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..