Team India: ‘అతడు టెస్టులకు పనికిరాడు.. రోహిత్‌ను పక్కనపెట్టి వెంటనే వన్డేల్లో కెప్టెన్సీ చేపట్టాలి’

స్వదేశీ పిచ్‌లపై దుమ్ములేపుతున్న టీమిండియా.. విదేశీ పిచ్‌లపై మాత్రం చేతులెత్తేస్తోంది. అంతేకాదు కీలకమైన ఐసీసీ టోర్నమెంట్లలోనూ వరుస పరాభవాలను ఎదుర్కుంటూ..

Team India: అతడు టెస్టులకు పనికిరాడు.. రోహిత్‌ను పక్కనపెట్టి వెంటనే వన్డేల్లో కెప్టెన్సీ చేపట్టాలి
Ind Vs Wi

Updated on: Jun 28, 2023 | 10:09 AM

స్వదేశీ పిచ్‌లపై దుమ్ములేపుతున్న టీమిండియా.. విదేశీ పిచ్‌లపై మాత్రం చేతులెత్తేస్తోంది. అంతేకాదు కీలకమైన ఐసీసీ టోర్నమెంట్లలోనూ వరుస పరాభవాలను ఎదుర్కుంటూ తీవ్ర విమర్శల పాలవుతోంది. ఈ నేపధ్యంలో పలువురు మాజీ క్రికెటర్లు టీమ్ మేనేజ్‌మెంట్, సెలెక్టర్లపై విరుచుకుపడుతున్నారు. ఫార్మాట్ ఏదైనా కూడా జట్టు కూర్పు విషయంలో పాలిటిక్స్ జరుగుతోందని మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా టీమిండియా ఆల్‌రౌండర్‌పై సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు మాజీ కోచ్ రవిశాస్త్రి.

వెన్ను నొప్పి కారణంగా జట్టుకు దూరమైన హార్దిక్ పాండ్యా.. ఆ తర్వాత పునరాగమనం ఇచ్చిన దగ్గర నుంచి బౌలింగ్ తక్కువగానే చేస్తున్నాడు. ఫుల్ టైం ఆల్‌రౌండర్‌గా ఇంకా ఫిట్ కాలేదు. దీంతో హార్దిక్ టెస్టులకు పనికిరాడని.. వైట్-బాల్ క్రికెట్‌పై ఎక్కువగా దృష్టి సారించాలని రవిశాస్త్రి సలహా ఇచ్చాడు. వన్డే ప్రపంచకప్ అనంతరం పరిమిత ఓవర్లకు హార్దిక్ పాండ్యా రెగ్యులర్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని అభిప్రాయపడ్డాడు. తనలోని కెప్టెన్సీ స్కిల్స్‌ను హార్దిక్.. ఐపీఎల్‌లోనే చూపించాడని.. గుజరాత్ టైటాన్స్‌ను వరుసగా రెండు సీజన్లలో ఫైనల్ వరకు ముందుండి నడిపించిన తీరు అద్భుతమని రవిశాస్త్రి ప్రశంసించాడు. ప్రపంచకప్‌లో కచ్చితంగా రోహిత్ శర్మ నేతృత్వంలోనే టీమిండియా బరిలోకి దిగుతుంది. కానీ ఆ తర్వాత హార్దిక్ ఆ బాధ్యతలు చేపట్టాలని రవిశాస్త్రి ‘ది వీక్’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు.

మరోవైపు సంజూ శాంసన్‌పై కూడా కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘శాంసన్ ఒక మ్యాచ్ విన్నర్. వచ్చే వన్డే ప్రపంచకప్‌లో అతడు టీమిండియాకు కీలకం కానున్నాడు. శాంసన్ ఇంకా అంతర్జాతీయ స్థాయిలో తన సత్తాను చాటుకోలేకపోతున్నాడు. ఏదో మిస్ అవుతోంది. అతడికి వన్డేల్లో ఎక్కువ ఛాన్స్‌లు ఇవ్వాలి. కచ్చితంగా బెస్ట్ ఫినిషర్‌గా తన కెరీర్‌కు ముగింపు చెప్పగలడు. ఒకప్పుడు రోహిత్ శర్మ టెస్టుల్లో ఓపెనర్‌గా ఆడకపోయి ఉంటే.. ఎలా ఫీల్ అయ్యేవాడినో.. ఇప్పుడు సంజూ శాంసన్ విషయంలోనూ ఆ ఫీలింగే ఉందని’ రవిశాస్త్రి స్పష్టం చేశాడు.