T20 World Cup 2026 : కప్పు కొడితే టీమిండియాకు రూ.21 కోట్లు.. రన్నరప్ కు దక్కేది ఎంతంటే?

T20 World Cup 2026 : అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా మార్చి 8న జరగనున్న భారత్-న్యూజిలాండ్ టీ20 వరల్డ్ కప్ ఫైనల్ పోరుపై ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ప్రైజ్ మనీ రూ.103 కోట్లుగా ఐసీసీ ప్రకటించింది. విజేతగా నిలిచిన జట్టుకు రూ. 21.51 కోట్లు, రన్నరప్‌కు రూ. 10.75 కోట్లు లభించనున్నాయి.

T20 World Cup 2026 : కప్పు కొడితే టీమిండియాకు రూ.21 కోట్లు.. రన్నరప్ కు దక్కేది ఎంతంటే?
T20 World Cup 2026 Team India

Updated on: Mar 07, 2026 | 5:01 PM

T20 World Cup 2026 : అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా మార్చి 8న జరగనున్న భారత్-న్యూజిలాండ్ టీ20 వరల్డ్ కప్ ఫైనల్ పోరుపై ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ఈ మ్యాచ్ కేవలం ట్రోఫీ కోసం మాత్రమే కాదు, కాసుల వర్షం కురిపించే వేదిక కూడా. ఈ టోర్నీ కోసం ఐసీసీ ఏకంగా 103 కోట్ల రూపాయల భారీ ప్రైజ్ మనీని కేటాయించింది. టోర్నీలో పాల్గొన్న 20 జట్లకు వారి ప్రదర్శన ఆధారంగా ఈ మొత్తాన్ని పంచనున్నారు. అయితే అందరి కళ్లు ఇప్పుడు టీమ్ ఇండియా ఎంత సొమ్మును ఇంటికి తీసుకెళ్తుందనే దానిపైనే ఉన్నాయి.

కప్పు కొడితే కింగ్.. కోట్లలో ప్రైజ్ మనీ

ఫైనల్‌లో భారత్ గనుక న్యూజిలాండ్‌ను చిత్తు చేసి విశ్వవిజేతగా నిలిస్తే, టీమిండియాకు 21.51 కోట్ల రూపాయల భారీ ప్రైజ్ మనీ అందుతుంది. ఒకవేళ దురదృష్టవశాత్తు భారత్ రన్నరప్‌గా నిలిచినా, దాదాపు 10.75 కోట్ల రూపాయలు లభిస్తాయి. కివీస్ జట్టుకు కూడా ఇదే వర్తిస్తుంది. అంటే గెలిచినా, ఓడినా ఈ రెండు జట్లకు కోట్ల రూపాయల పంట పండటం ఖాయం. కానీ భారత్ లక్ష్యం మాత్రం ఆ బంగారు కప్పుతో పాటు 21 కోట్ల రూపాయల జాక్‌పాట్ కొట్టడమే!

ఓడిన జట్లకు కూడా భారీగా వాటా

కేవలం ఫైనలిస్టులకే కాకుండా, సెమీఫైనల్ వరకు వచ్చి వెనుదిరిగిన ఇంగ్లండ్, సౌతాఫ్రికా జట్లకు కూడా ఐసీసీ భారీ నజరానాలు ఇస్తోంది. ఈ రెండు జట్లకు తలో 6.20 కోట్ల రూపాయలు అందనున్నాయి. అలాగే పాయింట్ల పట్టికలో 5 నుంచి 8వ స్థానాల్లో నిలిచిన జట్లకు రూ.2.48 కోట్లు, 9 నుంచి 12వ స్థానాల్లో నిలిచిన జట్లకు రూ. 1.24 కోట్లు లభిస్తాయి. టోర్నీలో చివరి వరుసలో (13 నుంచి 20 స్థానాలు) నిలిచిన జట్లు కూడా ఖాళీ చేతులతో వెళ్లవు, వారికి కూడా ఒక్కో జట్టుకు రూ.1.03 కోట్లు అందుతాయి.

గెలిచిన ప్రతి మ్యాచ్‌కు అదనపు బోనస్

ఈ మెగా టోర్నీలో బేస్ ప్రైజ్ మనీతో పాటు, ప్రతి మ్యాచ్ గెలుపుకు ఐసీసీ ప్రత్యేక ప్రోత్సాహకాన్ని అందిస్తోంది. టోర్నీలో గెలిచిన ప్రతి మ్యాచ్‌కు ఆయా జట్లకు రూ.28.64 లక్షల అదనపు నగదు అందుతుంది. అంటే ఎక్కువ మ్యాచ్‌లు గెలిచి ఫైనల్ చేరిన టీమిండియా లాంటి జట్లకు ఈ బోనస్ మొత్తం కూడా భారీగానే ఉండబోతోంది. ఇవన్నీ కలుపుకుంటే చాంపియన్‌గా నిలిచే జట్టు ఖజానా నిండిపోవడం ఖాయం.

భారత అభిమానుల ఆశ అదే

ప్రస్తుతం టీమిండియా ఉన్న ఫామ్ చూస్తుంటే న్యూజిలాండ్‌ను ఓడించి టైటిల్ గెలవడం పెద్ద కష్టమేమీ కాదని విశ్లేషకులు భావిస్తున్నారు. అహ్మదాబాద్‌లో లక్షలాది మంది ప్రేక్షకుల మధ్య రోహిత్ సేన ట్రోఫీని గెలిచి, ఆ 21 కోట్ల రూపాయల ప్రైజ్ మనీని సొంతం చేసుకోవాలని దేశమంతా కోరుకుంటోంది. ఒకవేళ వర్షం పడి మ్యాచ్ రద్దయినా లేదా సూపర్ ఓవర్ జరిగినా, ఐసీసీ నిబంధనల ప్రకారం విజేతను నిర్ణయించి ఈ భారీ మొత్తాన్ని అందజేస్తారు.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us