
USA Cricket Team: టీ20 వరల్డ్ కప్ 2026 సమరానికి రంగం సిద్ధమవుతోంది. భారత్ వర్సెస్ శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న ఈ మెగా టోర్నీ ప్రారంభానికి ముందే వివాదాలు మొదలయ్యాయి. తాజాగా అమెరికా (USA) క్రికెట్ జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టులోని కీలక ఆటగాళ్లకు భారత ప్రభుత్వం వీసా నిరాకరించడం ఇప్పుడు క్రీడా ప్రపంచంలో హాట్ టాపిక్గా మారింది.
అమెరికా జట్టులో కీలక సభ్యులైన నలుగురు ఆటగాళ్ల వీసా దరఖాస్తులను భారత విదేశాంగ శాఖ తిరస్కరించినట్లు తెలుస్తోంది. వీరిలో స్టార్ ఫాస్ట్ బౌలర్ అలీ ఖాన్, బ్యాటర్ షాయన్ జహంగీర్, మొహమ్మద్ మోసిన్, ఎహసాన్ ఆదిల్ ఉన్నారు.
వీరందరికీ వీసా నిరాకరించడానికి ప్రధాన కారణం వారి పాకిస్థాన్ మూలాలు. వీరంతా పాకిస్థాన్లో పుట్టి, ఆ తర్వాత అమెరికాకు వలస వెళ్లి అక్కడి పౌరసత్వం పొంది యూఎస్ఏ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా పాకిస్థాన్ మూలాలున్న వ్యక్తుల వీసా ప్రక్రియను భారత్ అత్యంత కఠినంగా పరిశీలిస్తుంది. గతంలో ఇంగ్లాండ్ ఆటగాళ్లు షోయబ్ బషీర్, రెహాన్ అహ్మద్లకు కూడా ఇలాంటి సమస్యలే ఎదురయ్యాయి.
తనకు భారత వీసా లభించలేదని అమెరికా పేసర్ అలీ ఖాన్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీ ద్వారా వెల్లడించారు. వరల్డ్ కప్ వంటి ప్రతిష్టాత్మక టోర్నీలో ఆడే అవకాశం రాకపోవడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. గత టీ20 వరల్డ్ కప్లో అమెరికా సూపర్-8కు చేరడంలో అలీ ఖాన్ కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు ఆయన దూరం కావడం యూఎస్ఏ జట్టుకు పెద్ద లోటు.
2026 టీ20 వరల్డ్ కప్లో అమెరికా జట్టు గ్రూప్-ఏలో ఉంది. విశేషమేమిటంటే, ఫిబ్రవరి 7న జరిగే తన మొదటి మ్యాచ్లోనే అమెరికా టీమ్ ఇండియాతో తలపడాల్సి ఉంది. ఒకవేళ ఈ నలుగురు కీలక ఆటగాళ్లకు వీసా రాకపోతే, బలమైన భారత్ను ఎదుర్కోవడం అమెరికాకు అసాధ్యంగా మారుతుంది.
సాధారణంగా పాకిస్థాన్ సంతతికి చెందిన విదేశీ క్రీడాకారులకు వీసా ఇచ్చే ముందు భారత హోం శాఖ, విదేశాంగ శాఖ సమగ్ర తనిఖీలు చేస్తాయి. ప్రస్తుతం ఈ నలుగురు ఆటగాళ్ల విషయంలో కూడా అదే జరుగుతోందని, త్వరలోనే వీరికి వీసా మంజూరయ్యే అవకాశం ఉందని కూడా విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, టోర్నీ సమయం దగ్గర పడుతుండటంతో యూఎస్ఏ క్రికెట్ బోర్డు ఆందోళన చెందుతోంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..