
T20 World Cup Final : మార్చి 8న అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనున్న భారత్-న్యూజిలాండ్ టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్ పోరుపై ప్రపంచ క్రికెట్ దిగ్గజాలు తమ అంచనాలను వేస్తున్నారు. ఈ క్రమంలో సౌతాఫ్రికా దిగ్గజ బౌలర్ డేల్ స్టెయిన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు క్రీడాలోకంలో పెను సంచలనం సృష్టిస్తున్నాయి. కివీస్ జట్టు గనుక ఈ ఫైనల్లో ఓడిపోతే, ఇప్పటివరకు సౌతాఫ్రికాకు ఉన్న చోకర్స్(కీలక సమయంలో చేతులెత్తేసేవారు) అనే బిరుదును అధికారికంగా న్యూజిలాండ్కు ఇచ్చేస్తానని స్టెయిన్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఏబీ డివిలియర్స్ యూట్యూబ్ ఛానెల్లో మాట్లాడుతూ ఆయన ఈ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
“నిజం చెప్పాలంటే, అందరూ సౌతాఫ్రికాను చోకర్స్ అని పిలుస్తారు. కానీ మాకంటే ఎక్కువ సార్లు ఐసీసీ ఫైనల్స్కు చేరిన న్యూజిలాండ్ కూడా ఇప్పటివరకు పెద్దగా కప్పులు గెలవలేదు. ఒకవేళ రేపు భారత్ చేతిలో కివీస్ ఓడిపోతే, మా దగ్గర ఉన్న చోకర్స్ కార్డును నేను అధికారికంగా వాళ్లకే ఇచ్చేస్తాను. అది ఇకపై మీదే. నాకు న్యూజిలాండ్ అంటే ఇష్టమే కానీ, వాళ్లు భారత్ను ఓడించడం దాదాపు అసాధ్యం” అని స్టెయిన్ కుండబద్దలు కొట్టాడు. భారత్ ఈ మ్యాచ్లో ఓడిపోవాలంటే ఏదైనా అద్భుతం జరగాలని, లేదంటే వాళ్లే కప్పు కొడతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ఈ టోర్నీలో ఇరు జట్లు అద్భుతమైన ఫామ్లో ఉన్నాయి. కోల్కతాలో జరిగిన మొదటి సెమీఫైనల్లో కివీస్ స్టార్ బ్యాటర్ ఫిన్ అలెన్ కేవలం 33 బంతుల్లోనే మెరుపు సెంచరీ బాది సౌతాఫ్రికాను ఇంటికి పంపాడు. టోర్నీ ఆరంభం నుంచి ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోని సఫారీలను కివీస్ మట్టికరిపించింది. మరోవైపు, ముంబైలో జరిగిన రెండో సెమీఫైనల్లో టీమిండియా 7 పరుగుల తేడాతో ఇంగ్లండ్ను చిత్తు చేసి ఫైనల్కు దూసుకొచ్చింది. సొంత గడ్డపై ఆడుతుండటం భారత్కు పెద్ద ప్లస్ పాయింట్.
భారత్ ఫేవరెట్ అయినప్పటికీ, అహ్మదాబాద్ స్టేడియం రికార్డులు కాస్త భయపెడుతున్నాయి. 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఇదే మైదానంలో భారత్ ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. అలాగే ప్రస్తుత టీ20 వరల్డ్ కప్లో కూడా ఇదే స్టేడియంలో జరిగిన మ్యాచ్లో సౌతాఫ్రికా చేతిలో భారత్ పరాజయం పాలైంది. ఈ నేపథ్యంలో కివీస్ కెప్టెన్ శాంట్నర్, తన స్పిన్ మ్యాజిక్తో భారత్ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నాడు. అయితే సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత బ్యాటింగ్ లైనప్ ఏ బౌలింగ్నైనా తుత్తునియలు చేసేలా కనిపిస్తోంది.
ఒకవేళ కివీస్ ఓడిపోతే స్టెయిన్ అన్నట్టుగా చోకర్స్ ముద్ర వారిపై పడటం ఖాయం. ఎందుకంటే గత దశాబ్ద కాలంలో న్యూజిలాండ్ చాలాసార్లు ఫైనల్స్, సెమీఫైనల్స్ వరకు వచ్చి కప్పుకు దూరమైంది. భారత జట్టు మాత్రం ఈసారి ఎట్టిపరిస్థితుల్లోనూ ఆ ఛాన్స్ ఇవ్వకూడదని పట్టుదలగా ఉంది. ఈ మెగా ఫైనల్ కేవలం ఒక మ్యాచ్ మాత్రమే కాదు, ఎవరు అసలైన ఛాంపియన్ అని తేల్చే సమరం.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..