Smriti Mandhana : కేవలం ఒక్క మ్యాచ్‌కే బిల్డప్ ఇస్తే ఎలా?..భారత్, పాక్ మ్యాచ్‌పై స్మృతి మంధాన సంచలన వ్యాఖ్యలు

Smriti Mandhana : భారత మహిళల క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధాన భారత్-పాక్ రైవల్రీపై ఒక బోల్డ్ స్టేట్‌మెంట్ ఇచ్చారు. కేవలం ఈ ఒక్క మ్యాచ్‌కే విపరీతమైన బిల్డప్ ఇవ్వడం ఆపేసి, మొత్తం వరల్డ్ కప్ టోర్నమెంట్‌ను సమానంగా చూడాలని అభిమానులకు, మీడియాకు సూచించారు.

Smriti Mandhana : కేవలం ఒక్క మ్యాచ్‌కే బిల్డప్ ఇస్తే ఎలా?..భారత్, పాక్ మ్యాచ్‌పై స్మృతి మంధాన సంచలన వ్యాఖ్యలు
Smriti Mandhana

Updated on: Jun 03, 2026 | 8:15 PM

Smriti Mandhana : మహిళల టీ20 ప్రపంచకప్ 2026 మరికొద్ది రోజుల్లో ఇంగ్లాండ్ వేదికగా ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నమెంట్ జూన్ 12 నుంచి జూలై 5 వరకు జరగనుంది. అయితే ఎప్పటిలాగే అందరి దృష్టి జూన్ 14న జరగబోయే భారత్, పాకిస్తాన్ హై-వోల్టేజ్ మ్యాచ్‌పైనే ఉంది. ఈ నేపథ్యంలో భారత మహిళల క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధాన భారత్-పాక్ రైవల్రీపై ఒక బోల్డ్ స్టేట్‌మెంట్ ఇచ్చారు. కేవలం ఈ ఒక్క మ్యాచ్‌కే విపరీతమైన బిల్డప్ ఇవ్వడం ఆపేసి, మొత్తం వరల్డ్ కప్ టోర్నమెంట్‌ను సమానంగా చూడాలని అభిమానులకు, మీడియాకు సూచించారు.

ఒక్క మ్యాచ్‌కే ఎందుకు అంత బిల్డప్?

ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో టీ20 మ్యాచ్ ముగిసిన అనంతరం ఏర్పాటు చేసిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో స్మృతి మంధాన మాట్లాడారు. “2022లో బర్మింగ్‌హామ్‌లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్ టికెట్లన్నీ హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. ఆ మ్యాచ్‌కు భారీ రెస్పాన్స్ వచ్చింది. కేవలం భారత్, పాకిస్తాన్ మ్యాచ్ మాత్రమే కాదు.. మిగతా మ్యాచ్‌లకు కూడా అదే స్థాయి క్రేజ్ ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఈ ఒక్క మ్యాచ్‌కు మాత్రమే ప్రత్యేకంగా హైప్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే దానికి ఆల్రెడీ చాలా క్రేజ్ ఉంది. అభిమానులందరూ టోర్నీ అంతటా మాకు సపోర్ట్ ఇస్తారని ఆశిస్తున్నాను” అని మంధాన స్పష్టం చేశారు.

గ్రూప్ స్టేజ్ సమీకరణాలు ఇవే

ఈ ప్రపంచకప్‌లో భారత జట్టు కేవలం పాకిస్తాన్‌తోనే కాకుండా మరికొన్ని బలమైన జట్లతో తలపడాల్సి ఉంది. గ్రూప్ స్టేజ్‌లో భారత్ తన తొలి మ్యాచ్‌ను జూన్ 14న పాకిస్తాన్‌తో ఆడుతుంది. ఆ తర్వాత నెదర్లాండ్స్, సౌతాఫ్రికా, బంగ్లాదేశ్, డిఫెండింగ్ ఛాంపియన్స్ ఆస్ట్రేలియా జట్లతో లీగ్ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. కాబట్టి టోర్నీలో ముందుకు వెళ్లాలంటే ప్రతి మ్యాచ్ కూడా చాలా కీలకమని, అందుకే కేవలం ఒకే ఒక్క మ్యాచ్ చుట్టూ కథ నడపడం కరెక్ట్ కాదని ఆమె అభిప్రాయపడ్డారు.

పాకిస్తాన్‌పై భారత్‌దే పైచేయి

మహిళల టీ20 అంతర్జాతీయ క్రికెట్ చరిత్రను పరిశీలిస్తే పాకిస్తాన్‌పై భారత జట్టుకు తిరుగులేని రికార్డు ఉంది. ఇప్పటివరకు ఇరు జట్లు 16 సార్లు ముఖాముఖి తలపడగా.. అందులో టీమిండియా ఏకంగా 13 సార్లు ఘన విజయం సాధించింది. పాకిస్తాన్ కేవలం 3 మ్యాచ్‌ల్లో మాత్రమే గెలవగలిగింది. చివరిసారిగా రెండు సంవత్సరాల క్రితం 2024 టీ20 వరల్డ్ కప్‌లో తలపడినప్పుడు కూడా భారత్ 6 వికెట్ల తేడాతో పాకిస్తాన్‌ను సులభంగా ఓడించింది. రికార్డుల పరంగా భారత్ చాలా బలంగా ఉండటంతో ఈసారి కూడా టీమిండియాదే విజయం అని ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు.

స్మృతి మంధాన ఫామ్ భారత్‌కు ఎంతో కీలకం

ఈ సమ్మర్ సీజన్ లో జరగబోయే వరల్డ్ కప్‌లో వైస్ కెప్టెన్ స్మృతి మంధాన ప్రదర్శన భారత జట్టుకు ఎంతో కీలకం కానుంది. వరల్డ్ కప్ టోర్నీలలో ఆమెకు ఆశించిన స్థాయిలో రికార్డు లేదు. ఇప్పటివరకు ఆడిన 25 ఇన్నింగ్స్‌ల్లో 21.83 సగటుతో, 114.41 స్ట్రైక్ రేట్‌తో 524 పరుగులు మాత్రమే చేశారు. ఈసారి ఇంగ్లాండ్ పిచ్‌లపై మంధాన గనుక ఫామ్‌లోకి వచ్చి భారీ ఇన్నింగ్స్‌లు ఆడితే, భారత మహిళల జట్టు తొలిసారి టీ20 ప్రపంచకప్ ట్రోఫీని ముద్దాడటం పెద్ద కష్టమేమీ కాదని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.

 

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us