
India vs South Africa 3rd T20I: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్లో భాగంగా 3వ టీ20 మ్యాచ్ కోసం భారత జట్టులో కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. తాజా నివేదికల ప్రకారం, ఓపెనర్ శుభ్మన్ గిల్ ఈ మ్యాచ్కు దూరమయ్యే అవకాశం ఉందని, అతని స్థానంలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్కు అవకాశం దక్కనుందని తెలుస్తోంది. రెండు మ్యాచ్ల తర్వాత కోచ్ గౌతమ్ గంభీర్ కీలక నిర్ణయం తీసుకోవాల్సి వస్తోంది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్తోపాటు, వైస్ కెప్టెన్ గిల్ కూడా దారుణంగా విఫలమవుతున్నారు. ఈ క్రమంలో తుది జట్టు (Probable XI)లో కీలక మార్పులు జరిగే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.
భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా మూడో టీ20 మ్యాచ్ ఆదివారం (డిసెంబర్ 14) ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరగనుంది. ఈ మూడో టీ20 కోసం భారత జట్టు మేనేజ్మెంట్ వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్ను తుది జట్టు (ప్లేయింగ్ XI) నుంచి తప్పించే అవకాశం ఉంది. మంగళవారం జరిగిన సిరీస్ మొదటి మ్యాచ్లో రెండు బంతుల్లో నాలుగు పరుగులు చేసిన గిల్, గురువారం (డిసెంబర్ 11) జరిగిన రెండో టీ20లో గోల్డెన్ డక్ (మొదటి బంతికే ఔట్) అయ్యాడు. బ్యాటింగ్లో వరుస వైఫల్యాల కారణంగా అతను తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు.
గిల్ స్థానంలో మూడో టీ20కి ఓపెనర్గా సంజు శాంసన్ను పరిశీలించే అవకాశం ఉంది. భారత్ తరఫున ఓపెనర్గా 17 టీ20 మ్యాచ్లు ఆడిన శాంసన్ మొత్తం 522 పరుగులు సాధించాడు. రెండు సార్లు టీ20 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టు తరఫున 2024లో ఓపెనర్గా ఆడుతూ శాంసన్ మూడు సెంచరీలు చేయడం విశేషం.
గిల్తో పాటు, అర్ష్దీప్ సింగ్ కూడా మూడో టీ20లో తన స్థానాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. గురువారం జరిగిన మ్యాచ్లో తన కోటా నాలుగు ఓవర్లలో 54 పరుగులు సమర్పించుకున్న అర్ష్దీప్, ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. పైగా తొమ్మిది వైడ్ బంతులు వేయడం ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్కు ఆగ్రహం తెప్పించింది. అతని స్థానంలో హర్షిత్ రాణా జట్టులోకి వచ్చే అవకాశం ఉంది.
ఇక జితేష్ శర్మ జట్టులో తన స్థానాన్ని కాపాడుకుంటాడా అనేది ఆసక్తికరంగా మారింది. సాధారణంగా లోయర్ మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్ చేసే జితేష్, మొదటి బంతి నుంచే భారీ షాట్లు ఆడాల్సి ఉంటుంది. కానీ తొలి రెండు మ్యాచ్లలో అతను అంచనాలను అందుకోవడంలో విఫలమయ్యాడు. అంతేకాకుండా, శాంసన్ జట్టులోకి వస్తే వికెట్ కీపింగ్ బాధ్యతలు కూడా చేపడతాడు కాబట్టి, స్పెషలిస్ట్ బౌలర్గా వాషింగ్టన్ సుందర్ లేదా కుల్దీప్ యాదవ్ను తీసుకునే వెసులుబాటు భారత్కు కలుగుతుంది.
గత నెల ఆస్ట్రేలియాలో జరిగిన టీ20 సిరీస్లో సుందర్ తన ఆల్ రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకోగా, కుల్దీప్ 2025లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా నిలిచాడు. కాన్పూర్కు చెందిన కుల్దీప్, ఆసియా కప్ 2025లో భారత్ ఆడిన మొత్తం ఏడు మ్యాచ్లలో పాల్గొని 17 వికెట్లు పడగొట్టి టోర్నీలోనే అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా నిలిచాడు.
దక్షిణాఫ్రికాతో జరిగే 3వ టీ20కి భారత అంచనా తుది జట్టు: అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా.