శ్రీలంకతో జరుగుతోన్న మూడో వన్డేలో టీమిండియా బ్యాటర్లు తుఫాన్ ఇన్నింగ్స్లతో బౌండరీల వర్షం కురిపించారు. ఈ మ్యాచ్లో భారత్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. మొదటి రెండు వన్డేల మాదిరిగానే ఓపెనర్లుగా రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్.. టీమిండియాకు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. వీరిద్దరూ 10 ఓవర్లకు 75 పరుగులు జోడించారు. శ్రీలంక తొలి ఓవర్ మేడిన్ కాగా.. మొదటి 5 ఓవర్లకు టీమిండియా కేవలం 19 పరుగులు మాత్రమే జోడించింది. కానీ ఆ తర్వాత ఓపెనర్లు ఇద్దరూ గేర్ మార్చి రెచ్చిపోయారు. మిగతా 5 ఓవర్లలో 56 పరుగులు రాబట్టి.. తొలి పవర్ప్లే ముగిసే సమయానికి 75 పరుగులు చేశారు.
భారత్ ఆరంభం నిదానంగా సాగినా.. ఆ తర్వాత రోహిత్, గిల్ లంక బౌలర్లపై విరుచుకుపడ్డారు. ముఖ్యంగా శ్రీలంక బౌలర్ లహిరు కుమార వేసిన 6 ఓవర్లో గిల్ వరుసగా 4 ఫోర్లు, ఈ ఓవర్ మొదటి బంతికి రోహిత్ శర్మ సిక్స్ బాదాడు. వెరిసి మొత్తంగా టీమిండియా 23 పరుగులు రాబట్టింది. అలాగే రజిత వేసిన 10వ ఓవర్లో రోహిత్ శర్మ 2 సిక్సర్లు, 1 ఫోర్ రాబట్టాడు.
తొలి 10 ఓవర్లలో 75 పరుగులు చేసిన తర్వాత రోహిత్, గిల్ దూకుడు ఆట కొనసాగించారు. ఇద్దరూ 14వ ఓవర్కు జట్టు స్కోరును 100 పరుగులకు చేరువ చేశారు. అయితే, టీమిండియా స్కోరు 100 పరుగుల మార్కును దాటకముందే రోహిత్ శర్మ 49 బంతుల్లో 42 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. అయితేనేం గిల్ ఒక ఎండ్లో స్కోర్ బోర్డును వేగంగా కదిలిస్తూ.. విరాట్ కోహ్లీ(166)తో కలిసి రెండో వికెట్కు 131 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. 97 బంతులు ఎదుర్కున్న గిల్.. 14 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో కెరీర్లో రెండో శతకాన్ని నమోదు చేసుకున్నాడు.
ఇక ఓపెనర్లు ఇద్దరూ పెవిలియన్ చేరాక.. కింగ్ కోహ్లీ ఊచకోత మొదలైంది. శ్రేయాస్ అయ్యర్(38)తో కలిసి మూడో వికెట్కు 108 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన కింగ్.. ఆ తర్వాత గేర్ మార్చి.. సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. బౌండరీల మీద బౌండరీలు బాదేస్తూ మరో సెంచరీ సాధించడమే కాదు.. ఇన్నింగ్స్ పూర్తయ్యేవరకు క్రీజులో అజేయంగా నిలిచాడు. మొత్తంగా 110 బంతులు ఎదుర్కున్న కోహ్లీ 13 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 166 పరుగులు చేశాడు.