Shreyas Iyer : కెప్టెన్‌గా తొలి గెలుపు.. ధోనీ ఆల్ టైమ్ రికార్డును బద్దలు కొట్టిన శ్రేయస్ అయ్యర్

Shreyas Iyer : జింబాబ్వేపై తొలి టీ20లో భారత్‌ను గెలిపించిన శ్రేయస్ అయ్యర్, కెప్టెన్‌గా తొలి విజయాన్ని నమోదు చేశాడు. వరుసగా 8 టాస్‌లు గెలిచి ఎంఎస్ ధోనీ ఆల్‌టైమ్ రికార్డును అధిగమించిన అయ్యర్, ప్రపంచ టీ20 క్రికెట్‌లోనూ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు.

Shreyas Iyer : కెప్టెన్‌గా తొలి గెలుపు.. ధోనీ ఆల్ టైమ్ రికార్డును బద్దలు కొట్టిన శ్రేయస్ అయ్యర్
Shreyas Iyer

Updated on: Jul 24, 2026 | 9:14 AM

Shreyas Iyer : జింబాబ్వేతో హరారే వేదికగా జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టు 7 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది. ఈ గెలుపు భారత సారథి శ్రేయస్ అయ్యర్‌కు ఎంతో ప్రత్యేకమైనది. అంతర్జాతీయ టీ20లలో కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత గత ఏడు మ్యాచ్‌ల్లో గెలుపును చవిచూడని అయ్యర్‌కు నాయకుడిగా ఇది తొలి విజయం కావడం విశేషం. ఈ చారిత్రక విజయంతో శ్రేయస్ అయ్యర్ సిరీస్‌లో భారత్‌కు 1-0 ఆధిక్యాన్ని అందించడమే కాకుండా, క్రికెట్ చరిత్రలో ఒక అరుదైన రికార్డును తన పేరిట నమోదు చేసుకున్నారు.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలవడం ద్వారా టీ20 క్రికెట్‌లో టీమిండియా దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ పేరిట ఉన్న ఒక అరుదైన రికార్డును శ్రేయస్ అయ్యర్ బద్దలు కొట్టారు. టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లలో భారత కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అయ్యర్ వరుసగా 8 మ్యాచ్‌ల్లోనూ టాస్ గెలిచారు. గతంలో ఎంఎస్ ధోనీ భారత టీ20 కెప్టెన్‌గా వరుసగా 7 టాస్‌లు గెలిచి అగ్రస్థానంలో ఉండగా, అయ్యర్ ఆ రికార్డును అధిగమించారు. అంతేకాకుండా ప్రపంచ స్థాయిలో పురుషుల టీ20 ఐలలో ఒక కెప్టెన్ తాను సారథ్యం వహించిన తొలి 8 మ్యాచ్‌ల్లోనూ వరుసగా టాస్ గెలిచిన ఏకైక ఆటగాడిగా అయ్యర్ ప్రపంచ రికార్డు సృష్టించారు.

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్, జింబాబ్వేను నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి కేవలం 125 పరుగులకే పరిమితం చేసింది. సుదీర్ఘ కాలం గాయం నుంచి కోలుకుని పునరాగమనం చేసిన యువ స్పీడ్‌స్టర్ మయాంక్ యాదవ్ మ్యాచ్‌లోని మొదటి బంతికే వికెట్ తీసి ప్రత్యర్థిని గట్టి దెబ్బతీశాడు. మయాంక్ తన 4 ఓవర్లలో కేవలం 18 పరుగులిచ్చి 2 వికెట్లు తీయగా, అతనికి తోడుగా ప్రిన్స్ యాదవ్ కూడా 19 పరుగులిచ్చి 2 వికెట్లతో కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. భారత బౌలర్ల పదునైన దాడికి జింబాబ్వే బ్యాటర్లు పరుగులు చేసేందుకు తీవ్రంగా శ్రమించారు.

అనంతరం 126 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు, కేవలం 13.2 ఓవర్లలోనే 3 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఊదేసింది. 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ జింబాబ్వే బౌలర్లపై విరుచుకుపడి కేవలం 18 బంతుల్లోనే మెరుపు అర్ధశతకం సాధించాడు. ఈ ధనాధన్ ఇన్నింగ్స్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లో అతి పిన్న వయస్సులో హాఫ్ సెంచరీ చేసిన ఆటగాడిగా వైభవ్ ప్రపంచ రికార్డు క్రియేట్ చేశాడు. ఆ తర్వాత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (28 నాటౌట్), వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ (35) బాధ్యతాయుతంగా బ్యాటింగ్ చేసి జట్టును విజయతీరాలకు చేర్చారు.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us