Sanju Samson : ఒకే ఓవర్లో 6సిక్స్ లు కొట్టి మీ చేత శభాష్ అనిపించుకుంటా.. పాపం నీ కల నెరవేరేనా బ్రో

సంజూ శాంసన్ ఐపీఎల్ 2026 కంటే ముందు రాజస్థాన్ రాయల్స్‌ను వీడతారని వార్తలు వస్తున్నాయి. అతను ఇప్పటివరకు ఈ ఫ్రాంచైజీకి 149 మ్యాచ్‌లు ఆడి, 4000కు పైగా పరుగులు చేశారు. రాజస్థాన్ రాయల్స్ తరపున అత్యధిక మ్యాచ్‌లు ఆడిన, అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా సంజూ నిలిచారు.

Sanju Samson : ఒకే ఓవర్లో 6సిక్స్ లు కొట్టి మీ చేత శభాష్ అనిపించుకుంటా.. పాపం నీ కల నెరవేరేనా బ్రో
Sanju Samson

Updated on: Aug 11, 2025 | 2:43 PM

Sanju Samson : టీ20 క్రికెట్‌లో తన దూకుడు బ్యాటింగ్‌తో అభిమానులను అలరించే సంజూ శాంసన్ మరోసారి వార్తల్లో నిలిచారు. కేరళకు చెందిన 30 ఏళ్ల ఈ రైట్-హ్యాండ్ బ్యాట్స్‌మెన్, టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కుట్టి స్టోరీస్ షోలో ఒక ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఒకే ఓవర్‌లో ఆరు బంతులకు ఆరు సిక్సర్లు కొట్టాలనేది తన చిరకాల స్వప్నమని చెప్పారు. 30 ఏళ్ల సంజూ శాంసన్ బ్యాటింగ్‌కు పెట్టింది పేరు. ఇటీవల అశ్విన్ షోలో మాట్లాడుతూ.. క్రికెట్ నుంచి రిటైర్ అయ్యేలోపు ఒక కల నెరవేర్చుకోవాలంటే అది ఒకే ఓవర్‌లో 6 సిక్సర్లు కొట్టడమేనని అన్నారు.

సంజూ శాంసన్ 2024లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 40 బంతుల్లోనే సెంచరీ సాధించి, ఒక ఓవర్‌లో వరుసగా ఐదు సిక్సర్లు కొట్టాడు. ఈ ప్రదర్శన అతని అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. జూలై 2015లో జింబాబ్వేతో జరిగిన టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌తో సంజూ శాంసన్ అరంగేట్రం చేశారు. ఇప్పటివరకు 42 మ్యాచ్‌లు ఆడి 3 సెంచరీలు, 2 హాఫ్ సెంచరీలు సాధించారు. 2024లో ఒకే క్యాలెండర్ ఇయర్లో 3 టీ20 సెంచరీలు చేసిన తొలి క్రికెటర్‌గా చరిత్ర సృష్టించారు. వన్డే క్రికెట్‌లో 16 మ్యాచ్‌లలో ఒక సెంచరీ, 3 హాఫ్ సెంచరీలు అతని ఖాతాలో ఉన్నాయి.

క్రికెట్ చరిత్రలో ఒకే ఓవర్‌లో ఆరు సిక్సర్లు కొట్టిన అరుదైన ఘనత సాధించిన ఆటగాళ్లలో యువరాజ్ సింగ్ అగ్రస్థానంలో ఉంటారు. అతను 2007 టీ20 వరల్డ్ కప్‌లో ఇంగ్లాండ్‌పై ఈ రికార్డును సాధించారు. ఆ తర్వాత వెస్టిండీస్‌కు చెందిన కైరన్ పొలార్డ్ 2021లో శ్రీలంకపై, నేపాల్‌కు చెందిన దీపేంద్ర సింగ్ ఐరీ 2024లో ఖతార్‌పై, బల్గేరియాకు చెందిన మనన్ బషీర్ 2025లో జిబ్రాల్టర్‌పై టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లలో ఈ ఘనత సాధించారు. ఇక వన్డే ఫార్మాట్‌లో దక్షిణాఫ్రికా ఆటగాడు హెర్షెల్ గిబ్స్ 2007 వరల్డ్ కప్‌లో నెదర్లాండ్స్‌పై, అమెరికాకు చెందిన జస్కరణ్ మల్హోత్రా 2021లో పాపువా న్యూ గినియాపై ఈ రికార్డు సాధించారు.

ఐపీఎల్‌లో సంజూ భవిష్యత్తుపై ప్రస్తుతం ఊహాగానాలు నడుస్తున్నాయి. అతను ఐపీఎల్ 2026కు ముందు రాజస్థాన్ రాయల్స్‌ను వీడే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. సంజూ రాయల్స్ తరపున 149 మ్యాచ్‌లు ఆడి 4000కు పైగా పరుగులు చేసి, ఆ జట్టు తరపున అత్యధిక మ్యాచ్‌లు ఆడిన, అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచారు. సంజూ శాంసన్ ఒక ఓవర్‌లో 6 సిక్సర్లు కొట్టాలన్న తన కలను నెరవేర్చుకుంటే, చరిత్రలో అరుదైన ఆటగాళ్ల జాబితాలో చేరిపోతారు.

 

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..